కుప్పకూలిన యువభారత్.. బంగ్లా ముందు స్వల్ప లక్ష్యం
By Newsmeter.Network
దక్షిణాఫ్రికాలోని ఫోచెస్ట్రూమ్ వేదికగా జరుగుతున్న అండర్-19 ప్రపంచకప్ ఫైనల్ లో టీమిండియా బ్యాట్స్మెన్లు తడబడ్డారు. బంగ్లా బౌలర్ల ధాటికి టిమిండియా బ్యాటింగ్ కుప్పకూలింది. 47.2 ఓవర్లలో 177 పరుగులకే ఆలౌట్ అయ్యింది. యశస్వి జైస్వాల్ (88: 121 బంతుల్లో 8ఫోర్లు, 1 సిక్స్) రాణించగా.. తిలక్ వర్మ(38) ఫర్వాలేదనిపించాడు.
టాస్ గెలిచిన బంగ్లాదేశ్ ఫీల్డింగ్ ఎంచుకుంది. భారత్ ఇన్నింగ్స్ను జైస్వాల్, సక్సేనాలు ఆరంభించారు. అయితే 17 బంతులు ఆడిన సక్సేనా రెండు పరుగులే చేసి పెవిలియన్ చేరాడు. ఆపై తిలక్ వర్మతో కలిసి జైస్వాల్ ఇన్నింగ్స్ను చక్కదిద్దాడు. ఈ జోడి రెండో వికెట్కు 94 పరుగులు జత చేసి ఇన్నింగ్స్ను చక్కదిద్దారు. కెప్టెన్ ప్రియాంగార్గ్(7), జైస్వాల్ ఔటైన తర్వాత ఏ ఒక్కరూ పెద్దగా ప్రభావం చూపలేదు. మధ్యలో జోరెల్(22) ఆడుతున్నాడనుకునే సమయంలో అనవసర పరుగు కోసం యత్నించి రనౌట్ రూపంలో వెనుదిరిగాడు. భారత్ చివర్లో వరుసగా వికెట్లు కోల్పోవడంతో 177 పరుగులకు ఆలౌటైంది. బంగ్లా బౌలర్లలో అవిషేక్ దాస్ మూడు వికెట్లు సాధించగా, షోరిఫుల్ ఇస్లామ్, హసన్ షకిబ్లు తలో రెండు వికెట్లు తీశారు. రకిబుల్ హసన్కు వికెట్ దక్కింది.