తిరుమలకు పోటెత్తిన భక్తులు.. గదుల బుకింగ్ విధానంలో మార్పులు..!
By అంజి Published on 16 Jan 2020 8:50 AM IST
తిరుమల: గదుల బుకింగ్ విధానంలో తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు(టీటీడీ) మార్పులు చేసింది. అద్దె గదులను ముందస్తుగా బుక్ చేసుకునే భక్తులకు కాషన్ డిపాజిట్ చెల్లించే విధానాన్ని టీటీడీ అమల్లోకి తీసుకురావాలని నిర్ణయం తీసుకుంది. గది ఖాళీ చేసే సమయంలో డిపాజిట్ తిరిగి ఇవ్వనున్నట్టు ప్రకటనలో తెలిపింది. కాగా ఈనెలాఖరు నాటికి ఆఫ్లైన్ బుకింగ్ విధానంలోనూ ఈ ప్రక్రియ అమలు కానుంది. ఆన్లైన్ బుకింగ్ చేసుకునే భక్తులకు కూడా వర్తిస్తుందన్న టీటీడీ అధికారులు తెలిపారు. భక్తుల రద్దీ దృష్ట్యా ఎదురవుతున్న సవాళ్లపై టీటీడీపీ దృష్టిపెట్టింది. కొందరు శ్రీవారి భక్తులు ఆన్లైన్లో రూమ్లు బుక్ చేసుకొని ఆలయానికి రావడం లేదు. దీంతో మిగిలిన భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలోనే టీటీడీ అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు.
తిరుమల శ్రీవెంకటేశ్వరస్వామి దర్శనం కోసం భక్తులు బారులు తీరారు. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. 30 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. కాగా స్వామివారి దర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. దివ్యదర్శనం, టైమ్స్లాట్, రూ.300 ప్రత్యేక దర్శనానికి 3 గంటల నుంచి 4 గంటలు పడుతోంది. సంక్రాంతి సందర్భంగా వేలాది మంది భక్తులు తిరుమలకు తరలివచ్చారు. నిన్న స్వామిని 81,394 మంది భక్తులు దర్శించుకున్నారు. రూ.2.47 కోట్ల హుండీ ఆదాయం వచ్చింది.