సమ్మెతో రోడ్డెక్కని బస్సులు.. స్తంభించిన జనజీవనం
By న్యూస్మీటర్ తెలుగు Published on 5 Oct 2019 6:18 AM GMTహైదరాబాద్ : ఆర్టీసీ కార్మికులు సమ్మెతో బస్సులు రోడ్డెక్కపోవడంతో ప్రయాణికులు ఓ రేంజ్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. శనివారం ఉదయం నుంచి బస్సులు లేకపోవడంతో జనాలు మెట్రో రైళ్లను, ప్రైవేట్ వాహనాలను ఆశ్రయించడంతో అవి కిక్కిరిసిపోయాయి. ఇక ప్రైవేట్ వాహనాలు, ఆటోవాలాలు ప్రయాణికుల వద్ద నుంచి రెట్టింపు ఛార్జీలు డిమాండ్ చేస్తున్నారు. ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఒకే ఛార్జీ అంటూ అడ్డగోలుగా వసూళ్లు చేస్తున్నారు.
మరోవైపు సమ్మె నేపథ్యంలో ప్రజలకు ఇబ్బంది కలుగకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ సందర్భంగా మెట్రో ట్రైన్ సర్వీసులు అర్థరాత్రి 12.30 గంటల వరకూ అందుబాటులోకి వచ్చాయి. అంతేకాకుండా ఉదయం 5 గంటల నుంచే మెట్రో సర్వీసులు ప్రారంభం అయ్యాయి. రద్దీగా ఉంటే ప్రతి మూడు నిమిషాలకు ఓ రైలును నడపనున్నారు. రద్దీని నియంత్రించేందుకు అదనపు టికెట్ కౌంటర్లను ఏర్పాటు చేశారు.