మరింత కఠినతరం చేయండి: కేసీఆర్‌

By సుభాష్  Published on  26 March 2020 8:40 AM GMT
మరింత కఠినతరం చేయండి: కేసీఆర్‌

కరోనా వైరస్‌ ఎఫెక్ట్‌తో దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్‌ అమలవుతోంది. ఇక తెలంగాణలో కూడా లాక్‌డౌన్‌ పటిష్టంగా అమలవుతోంది. ఇక 21 రోజుల పాటు లాక్‌డౌన్‌ను మరింత కఠినతరం చేయాల్సిందిగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధికారులకు సూచించారు. గురువారం కేసీఆర్‌ మంత్రులు, ఉన్నతాధికారులతో లాక్‌డౌన్‌ అమలవుతున్న తీరుపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కేసీఆర్‌ మాట్లాడుతూ.. ప్రస్తుతం అమలవుతున్న లాక్‌డౌన్‌ సంతృప్తికరంగా ఉన్నప్పటికీ మరింత కఠినంగా వచ్చే20రోజులు గడపాల్సి ఉందని, ప్రతీ ఒక్కరు గమనించాలని సూచించారు.

ఈ విషయాన్ని రాష్ట్ర వ్యాప్తంగా లాక్‌డౌన్‌ విజయవంతం అమలవుతుందని, రాబోయే రోజుల్లో ఇంకా మరింత పకడ్బంధీగా అమలు చేయాలని అధికారులను ఆదేశించారు కేసీఆర్‌. కరోనా వైరస్‌ వ్యాపించకుండా ఉండేందుకు దురాన్ని పాటించక తప్పని అన్నారు. మరో మార్గం లేదు కాబట్టి లాక్‌డౌన్‌ను విధిగా పాటించాలని కేసీఆర్‌ ప్రజలను కోరారు. రాష్ట్రంలో అమలవుతున్న లాక్‌డౌన్‌, రాత్రిపూట కర్ఫ్యూ, కరోనా వ్యాపించకుండా తగు సూచనలు , సలహాలు చేశారు.

కాగా, పోలీసు, వైద్య శాఖల సీనియర్‌ అధికారులు, పలు జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో సీఎం కేసీఆర్‌ ఫోన్‌లో మాట్లాడారు. ప్రస్తుత పరిస్థితి గురించి ఆరా తీశారు. విదేశాల నుంచి వచ్చిన వారు, వారితో సన్నిహితంగా మెలిగిన వారి విషయంలో అప్రమత్తంగా ఉండాలన్నారు. వారి ఆరోగ్య పరిస్థితిని ఎప్పకప్పుడు కనిపెడుతూ ఉండాలని సూచించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారి విషయంలో క్యారంటైన్‌లో ఉన్నవారి విషయంలో కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

కేసీఆర్‌ సంతృప్తి

తెలగాణలో లాక్‌డౌన్‌, రాత్రిపూట కర్ఫ్యూ విజయవంతం కావడంపై సీఎం కేసీఆర్‌ సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రజలు ఇదే విధంగా ప్రభుత్వానికి సహకరించి, సామాజిక దూరం పాటిస్తే కరోనాను తరిమికొట్టవచ్చని కేసీఆర్‌ అభిప్రాయపడ్డారు. ఎవరికైనా అనుమానం కలిగినా, వ్యాధి లక్షణాలు కనిపించినా వెంటనే పరీక్షలు చేయించుకోవాలని కోరారు. అలాగే రాత్రింబవళ్లు కష్టపడుతున్న పోలీసుల, వైద్య సిబ్బంది, శానిటరీ ఉద్యోగులకు కేసీఆర్‌ అభినందనలు తెలిపారు.

Next Story