తెలంగాణ ఎంసెట్‌ -2020 ఫలితాలు విడుదల

By సుభాష్  Published on  6 Oct 2020 11:18 AM GMT
తెలంగాణ ఎంసెట్‌ -2020 ఫలితాలు విడుదల

తెలంగాణలో నిర్వహించిన ఎంసెట్‌-2020 పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి. మంగళవారం జేఎన్టీయూ క్యాంపస్‌లో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఈ ఫలితాలను విడుదల చేశారు. కరోనా వైరస్‌ నేపథ్యంలో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు , మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఈ పరీక్షలు నిర్వహించారు. మొత్తం నాలుగు రోజుల పాటు ఆన్‌లైన్‌ ద్వారా అధికారులు ఈ పరీక్షలు నిర్వహించారు. ఇందు కోసం మొత్తం 102 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. అందులో 79 తెలంగాణలో, 23 పరీక్ష కేంద్రాలు ఏపీలో ఉన్నాయి. ఎంసెట్‌ ఇంజనీరింగ్‌లో 75.29 శాతం ఉత్తీర్ణత సాధించగా, 89,734 మంది ఉత్తీర్ణులయ్యారు. కాగా, ఈ ఏడాది ఎంసెట్‌ ఇంజనీరింగ్‌ పరీక్షకు 1,43,326 మంది దరఖాస్తు చేసుకోగా, 1,19,183 మంది పరీక్షకు హాజరయ్యారు.

ఈ ఫలితాల్లో టాప్‌ ర్యాంకులు అబ్బాయిలే ఉన్నారు. ఇంజనీరింగ్‌ విభాగంలో అబ్బాయిలకే తొలి 10 ర్యాంకులు సాధించారు. వారణాసి సాయితేజకు ఫస్ట్‌ ర్యాంకు, యశ్వంత్‌ సాయి సెకండ్‌ ర్యాంకు, టి. మణి వెంకటకృష్ణ 3వ ర్యాంకు, కౌశల్‌ కుమార్‌ రెడ్డి 4వ ర్యాంకు, ఆద్రిక్‌ రాజ్‌పాల్‌ 5వ ర్యాంకు, నాగెల్లి నితిన్‌ సాయి 6వ ర్యాంకు, తవ్వకృష్ణ రమేష్‌ 7వ ర్యాంకు, అన్నం సాయివర్ధన్‌ 8వ ర్యాంకు, సాయి హర్షవర్ధన్‌ 9వ ర్యాంకు, వారణాసి వచన్‌ సిద్దార్థ్కు 10వ ర్యాంకు వచ్చింది.

Next Story