భారత్ లో ట్రంప్ పర్యటన షెడ్యూల్

By రాణి  Published on  21 Feb 2020 12:06 PM GMT
భారత్ లో ట్రంప్ పర్యటన షెడ్యూల్

భారత్ లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పర్యటన షెడ్యూల్ ఖరారయింది. రెండ్రోజుల పాటు ఆయన ఇండియాలో పర్యటించనున్నారు. ఈనెల 24,25 తేదీల్లో ట్రంప్ తన భార్య మెలానియాతో కలిసి పర్యటిస్తారు. ఈ పర్యటనపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. అహ్మదాబాద్, ఆగ్రా, ఢిల్లీని ట్రంప్ దంపతులు సందర్శించనున్నారు. గడిచిన ఎనిమిది నెలల్లో చూస్తే..ట్రంప్ - మోడీల 5వ సమావేశం ఇది. ప్రపంచంలోనే అతి పెద్ద క్రికెట్ స్టేడియం అయిన అహ్మదాబాద్ మొతెరా గ్రౌండ్లో ‘నమస్తే ట్రంప్’ కార్యక్రమానికి వీరిద్దరు హాజరుకాన్నారు. గతేడాది టెక్సాస్ లో జరిగిన హౌడీ మోదీ తరహాలో జరిగే ఈ కార్యక్రమం ట్రంప్ టూర్ కు హైలైట్ గా మారనుంది.

24వ తేదీ, సోమవారం ఉదయం 11 గంటలకు ట్రంప్ దంపతులు ఎయిర్ ఫోర్స్ వన్ విమానంలో అహ్మదాబాద్ కు చేరుకుంటారు. అక్కడ ప్రధాని మోడీ వారికి స్వాగతం పలుకుతారు. అనంతరం ట్రంప్ బీస్ట్ కారులో మొతెరా స్టేడియంకు చేరుకుంటారు. ఈ మధ్యలో ఉన్న సబర్మతి ఆశ్రమంలో 15 నిమిషాలు గడుపుతారు. అమెరికా ప్రెసిడెంట్ కు ఆహ్వానం పలుకుతూ లక్షా పది వేల సీటింగ్ కెపాసిటీతో ఆధునికీకరించిన మొతెరా స్టేడియంలో జరిగే ‘నమస్తే ట్రంప్’ కార్యక్రమానికి ఇరువురు నేతలు మధ్యాహ్నం 12.30 గంటలకు హాజరై ప్రసంగిస్తారు. మధ్యాహ్నం 3.30 గంటలకు ట్రంప్, మెలానియా ఆగ్రా బయల్దేరి సాయంత్రం 5 గంటలకు అక్కడికి చేరుకుంటారు. రాత్రికి ఢిల్లీలోని ఐటీసీ మౌర్యా హోటల్ లో బస చేస్తారు.

25వ తేదీ, మంగళవారం ట్రంప్ దంపతులు రాష్ర్టపతి భవన్ ను సందర్శిస్తారు. ఉదయం 10.45 గంటలకు ట్రంప్, మెలానియా రాజ్ ఘాట్ కు చేరుకుని అక్కడ మోడీతో పాటు మహాత్మాగాంధీకి నివాళులర్పిస్తారు. అనంతరం సందర్శకుల పుస్తకంలో ట్రంప్ తన సందేశాన్ని రాసి..హైదరాబాద్ హౌజ్ కు బయల్దేరుతారు. హైదరాబాద్ హౌజ్ లో ఉదయం 11.30 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకూ మోడీ, ట్రంప్ ల మధ్య అత్యున్నత స్థాయి సమావేశం జరుగుతుంది. ఈ సమావేశంలో రెండు దేశాల మధ్య వివిధ అంశాలకు సంబంధించిన ఒప్పంద పత్రాలపై ఇరువురు సంతకాలు చేసి..మీడియా సమావేశం నిర్వహిస్తారు. మీడియా సమావేశం అనంతరం యూఎస్ ఎంబసీలో ఈసీఓ రౌండ్ టేబుల్ సమావేశముంటుంది.

అన్ని సమావేశాలు ముగిసిన తర్వాత ప్రధాని మోడీ ఇచ్చే లంచ్ లో ట్రంప్ దంపతులు పాల్గొంటారు. అక్కడి నుంచి ట్రంప్ ఐటీసీ మౌర్య హోటల్ చేరుకొని భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జై శంకర్, ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడుని కలవనున్నట్లు సమాచారం. మంగళవారం రాత్రి రాష్ర్టపతి భవన్ లో రాష్ర్టపతి రామ్ నాథ్ కోవింద్ ఇచ్చే విందులో ట్రంప్ దంపతులు పాల్గొని..10 గంటలకు వారి ప్రత్యేక విమానంలో అమెరికాకు పయనమవుతారు.

Next Story