సంక్రాంతిని కమ్మిన కారు 'ముగ్గులు'
By Newsmeter.Network Published on 13 Jan 2020 7:48 AM GMTమున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో టీఆర్స్ వినూత్నమైన ఎన్నికల ప్రచారానికి దిగింది. సూర్యాపేట మున్సిపాలిటీలో టీఆర్ఎస్ పార్టీ వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగపర్చుకుంటోంది. సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని ఇండ్ల ముందు వేసే ముగ్గులలో కారు గుర్తుకే మన ఓటు, కేసీఆర్ నాయకత్వం వర్థిల్లాలి, కేటీఆర్ నాయకత్వం వర్థిల్లాలి అంటూ ముగ్గుల రూపంలో జరుగుతున్న ప్రచారం పట్టణ ప్రజలను విశేషంగా ఆకట్టుకుంటోంది. తెలంగాణ ప్రభుత్వం అమలు పరుస్తున్న పథకాలను ముగ్గుల రూపంలో తెలుపుతూ పార్టీ మహిళలు తమదైన శైలిలో మద్దతు తెలుపుతున్నారు. మంత్రి జగదీష్రెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్న సూర్యాపేటలో టీఆర్ఎస్ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది.
ఖమ్మం జిల్లాలో ఎన్నికల్ల ప్రచారంలో భాగంగా ముగ్గులతో కారుగుర్తు వేసి ప్రచారం చేయాలని మంత్రి పువ్వాడ అన్నారు. టీఆర్ఎస్ కుటుంబ సభ్యులు ప్రతిరోజు తమ ఇంటి ముందు కారు గుర్తు వేసి, రంగులు అద్ది ప్రచార ఆస్త్రంగా మార్చుకోవాలని రాష్ట్ర రావాణశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పిలుపునిచ్చారు. మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో లకారం ట్యాంక్బండ్పై ముగ్గుల పోటీలు జరిగాయి. ఈ కార్యక్రమానికి హాజరైన మంత్రి పువ్వాడ.. రంగు రంగుల ముగ్గులను వేసిన వారిని అభినందించారు.
ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని మధిర, వైరా, సత్తుపల్లి, ఇల్లందు, కొత్తగూడెంలో టీఆర్ఎస్ శ్రేణులు తమ వార్డుల్లో కారు గుర్తులతో ముగ్గులను వేసి ప్రచారం నిర్వహించాలన్నారు. దీంతో ప్రతిపక్షాలు కారు గుర్తుని చూసి బేజారు అవుతారని అన్నారు. పార్టీశ్రేణులు ఈ సంక్రాంతి పండుగను పురస్కరించుకొని తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన వివిధ సంక్షేమ పథకాల చిత్రాలను ముగ్గుల రూపంలో ప్రజలకు వివరించాలని మంత్రి పువ్వాడ అన్నారు.