ఎన్నికల పోలింగ్‌ సిబ్బందికి అందనున్న ఆహారం ఇదే..

తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల పోలింగ్‌కు సమయం వచ్చేసింది.

By Srikanth Gundamalla  Published on  11 May 2024 12:32 PM GMT
lok sabha , polling, food,  election workers,

ఎన్నికల పోలింగ్‌ సిబ్బందికి అందనున్న ఆహారం ఇదే.. 

తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల పోలింగ్‌కు సమయం వచ్చేసింది. నాలుగో విడత ఎన్నికల పోలింగ్‌ ఏపీ, తెలంగాణతో పాటు 10 రాష్ట్రాల్లో జరగనుంది. ఈ మేరకు ఇప్పటికే ఎలక్షన్ కమిషన్ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. కావాల్సినంత సిబ్బందిని నియమించారు. మరోవైపు ఇది ఎండాకాలం.. ఎన్నడూ లేనంతడా సూర్యుడు తన ప్రతాపం చూపిస్తున్నాడు. ఈ క్రమంలో ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బంది ఆరోగ్యం పట్ల ఎలక్షన్ కమిషన్ అన్ని జాగ్రత్తలు తీసుకుంటోంది. వారికి పోషకాలతో కూడిన ఆహారం ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. ఇక ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బంది పోలింగ్‌ రోజు పెద్దగా విశ్రాంతి లేకుండా పని చేస్తూనే ఉంటారు.

సార్వత్రిక ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉద్యోగులు, సిబ్బందికి సమతుల ఆహారం అందించాలని ఎన్నికల కమిషన్ ఆదేశించింది. ముందుగా సిబ్బంది ఈ నెల 12వ తేదీన సామగ్రితో వారికి కేటాయించిన పోలింగ్ కేంద్రాలకు వెళ్తారు. ఆ రోజు సాయంత్రం 4 గంటలకు సమోసా, మజ్జిగ, ఇవ్వనున్నారు. సాయంత్రం 5 గంటలకు మజ్జిగ లేదంటే నిమ్మరసం అందిస్తారు. రాత్రి 7 నుంచి 8 గంటల మధ్యలో భోజనం ఏర్పాటు చేస్తారు. భోజనంలో భాగంగా అన్నం, కూర, చపాతీ, టమాటా పప్పు, పెరుగు, చట్నీ అందించనున్నారు.

పోలింగ్ రోజు 13న ఉదయం 6 గంటలకు టీ, రెండు అరటి పండ్లు అందిస్తారు. ఆ తర్వాత 8 గంటల నుంచి 9 గంటల మధ్య క్యారెట్, టమాటాతో కూడిన ఉస్మా, పల్లీల చట్నీ ఇస్తారు. ఉదయం 11-12 గంటల మధ్య మజ్జిగ ఇవ్వనున్నారు. మధ్యాహ్నం ఒంటి గంటకు భోజనం పెడతారు. ఇందులో కోడిగుడ్డు కూర, ఓ కూరగాయ కర్రీ, చట్నీ, సాంబార్, పెరుగు ఇస్తారు. మధ్యాహ్నం 3-4 గంటల మధ్య మజ్జిగ లేదా నిమ్మరసం ఇస్తారు. సాయంత్రం 5.30 గంటలకు బిస్కెట్లు, టీ ఇవ్వనున్నారు. ఆహారాన్ని అందించే ప్రక్రియలో పంచాయతీ, పురపాలికల్లో ప్రత్యేకంగా నియమితమైన అధికారులు పర్యవేక్షించాలని ఎన్నికల సంఘం సూచించారు. వేడి, ఉక్కపోత ఉన్న క్రమంలో అన్ని పోలింగ్ కేంద్రాల్లో ఫ్యాన్లు.. అవసరమైన చోట్ల కూలర్లు ఏర్పాటు చేయనున్నారు.

Next Story