ఆస్ట్రేలియాలో భారత విద్యార్థి హత్య.. ఇద్దరు సోదరుల అరెస్ట్
ఆస్ట్రేలియాలో భారత్కు చెందిన ఎంటెక్ విద్యార్థి హత్య కేసులో ఇద్దరిని అరెస్ట్ చేశారు పోలీసులు.
By Srikanth Gundamalla Published on 9 May 2024 10:24 AM IST
ఆస్ట్రేలియాలో భారత విద్యార్థి హత్య.. ఇద్దరు సోదరుల అరెస్ట్
ఆస్ట్రేలియాలో భారత్కు చెందిన ఎంటెక్ విద్యార్థి హత్య కేసులో ఇద్దరిని అరెస్ట్ చేశారు పోలీసులు. ఈ నెల 6వ తేదీన మెల్బోర్న్ సిటీలో భారత్కు చెందిన ఎంటెక్ విద్యార్థి నవజీత్ సంధూ దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. దీనిపై విచారణ జరిపిన పోలీసులు తాజాగా నిందితులను అరెస్ట్ చేశారు. విద్యార్థిని చంపిన కేసులో హర్యానాకు చెందిన ఇద్దరు సోదరులను అరెస్ట్ చేశారు. నిందితులను న్యూసౌత్వల్స్లో ఉంటోన్న అభిజిత్, రాబిన్ గార్టన్గా పోలీసులు వెల్లడించారు.
హర్యానాలోని కర్నాల్ ప్రాంతానికి చెందిన నవజీత్ సంధూ 2022 నవంబర్లో స్టూడెంట్ వీసాపై ఆస్ట్రేలియాకు వెళ్లాడు. అక్కడే ఎంటెక్ చేస్తున్నాడు. బాగా చదువుకుని మంచి ఉద్యోగం సంపాదించి స్థిరపడాలని కలలు కన్నాడు. అయితే.. అభిజిత్, రాబిన్ సోదరులతో పాటు శ్రావణ్ కుమార్ అనే యువకులు నవజీత్కు స్నేహితులు. హర్యానాకు చెందిన సోదరుల మధ్య గొడవే పెద్దది అయ్యి.. నవజీత్ సంధూ ప్రాణాలపైకి తెచ్చిందని అతని తండ్రి జితేందర్ సంధూ చెప్పారు. తమకు ఆదివారం తెల్లవారుజామున 2 గంటలకు నవజీత్ స్నేహితులు ఫోన్ చేశారనీ.. నవజీత్ చనిపోయాడని చెప్పినట్లు జితేందర్ వెల్లడించాడు. గొడవను అడ్డుకోబోయినందుకు తన కొడుకుని అన్యాయంగా చంపేశారని విలపించాడు.
అయితే.. శ్రావణ్ కుమార్ అనే విద్యార్థి రూమ్మేట్స్తో గొడవపడి నవజీత్ ఫ్లాట్కు వెళ్లాడనీ.. ఆ తర్వాత రూమ్మేట్స్ ఫోన్ చేయడంతో శ్రావణ్ బయటకు వెళ్లాడు. తోడుగా నవజీత్ను కూడా రావాలని కోరడంతో అతనూ వెళ్లాడని జితేందర్ సంధూ చెప్పాడు. ఈ సందర్భంగా శ్రావణ్పై కత్తితో అతని స్నేహితులు దాడి చేసేందుకు ప్రయత్నించారనీ.. వారిని అడ్డుకోబోయినందుకు నవజీత్ను పోడించాడరని ఆయన చెప్పారు.