స్కాలర్ షిప్‌ కోసం తండ్రి చనిపోయాడని డ్రామా, బహిష్కరించిన అమెరికా

ఓ భారతీయ విద్యార్థి స్కాలర్ షిప్ కోసం తండ్రి చనిపోయినట్లు తప్పుడు పత్రాలను సృష్టించాడు.

By Srikanth Gundamalla  Published on  29 Jun 2024 1:47 AM GMT
indian student, fake certificate, drama, america ban,

స్కాలర్ షిప్‌ కోసం తండ్రి చనిపోయాడని డ్రామా, బహిష్కరించిన అమెరికా

విదేశాల్లో చదువుకోవాలని చాలా మంది విద్యార్థులు అనుకుంటారు. ముఖ్యంగా అగ్రరాజ్యం వెళ్లాలనుకుంటారు. దీనికోసం ఎంతో కష్టపడుతారు. ఈ క్రమంలోనే అమెరికాలో ఉన్నత విద్యకు వెళ్లిన ఓ భారతీయ విద్యార్థి స్కాలర్ షిప్ కోసం తండ్రి చనిపోయినట్లు తప్పుడు పత్రాలను సృష్టించాడు. దాన్ని గుర్తించిన అధికారులు సీరియస్‌గా స్పందించారు. ఆ విద్యార్థిని ఏకంగా అమెరికా నుంచి బహిష్కరించారు. త్వరలోనే అతడిని భారత్‌కు పంపేయనున్నట్లు వెల్లడించారు.

ఆర్యన్ ఆనంద్ అనే 19ఏళ్ల భారతీయ విద్యార్థి ఎంఎస్ కోసం అమెరికా వెళ్లాడు. గతేడాది ఆగస్టులో పెన్సిల్వేనియాలోని బెత్లహామ్‌లో ఉన్న లేహ్‌ యూనివర్సిటీలో ప్రవేవం పొందాడు. ఈ క్రమంలోనే ఆర్యన్ నకిలీ సర్టిఫికెట్లు ఇచ్చాడు. టెన్త్ సర్టిఫికెట్లను కూడా ఫోర్జరీ చేశాడు. స్కాలర్ షిప్ కోసం తప్పుడు దారి ఎంచుకున్నాడు. ఏకంగా బతికున్న తండ్రినే చనిపోయాడని పేర్కొన్నాడు. ఫాదర్ చనిపోయాడని ఏకంగా డెత్ సర్టిఫికెట్ సృష్టించాడు. ఆ తర్వాత తనంతట తానే ఈ సర్టిఫికెట్‌ను సోషల్‌ మీడియాలో పెట్టుకున్నాడు. ఆ తర్వాత తన గుట్టు తానే రట్టు చేసుకున్నాడు. పదో తరగతి సర్టిఫికెట్ ఫోర్జరీ, తప్పుడు పత్రాలతో అమెరికా యూనివర్సిటీలో ప్రవేశం పొందిన విధానం, అనంతరం చదువుపై ఆసక్తి కోల్పోవడం, ఉపకార వేతనం కోసం మోసాలకు పాల్పడటం, తప్పుడు ఇంటర్న్‌షిప్‌ల ఇలా తాను చేసిన ప్రతి మోసాన్ని అందులో వివరించాడు.

చివరకు ఈ విషయం అమెరికా అధికారుల దృష్టికి కూడా వెళ్లింది. దాంతో కేసునమోదు చేసిన పోలీసులు జూన్ 12న ఆర్యన్‌ ఆనంద్‌ను అరెస్ట్ చేశారు.ఇలాంటి ఫోర్జరీ కేసుల్లో దాదాపు అమెరికాలో 20 ఏళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంటుంది. కానీ.. విద్యాసంస్థ అధికారయంత్రం అభ్యర్థన మేరకు సదురు విద్యార్థిపై బహిష్కరణ వేటు మాత్రమే వేశారు. గరిష్టంగా మూడు నెలల జైల్లో ఉండే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఇక ఆర్యన్ కూడా భారత్‌కు వెళ్లేందుకు అంగీకరించినట్లు లెహ్ యూనివర్సిటీ తెలిపింది. అతనికి రావాల్సిన రూ.70 లక్షలను కూడా తిరిగి ఇవ్వొద్దని నిర్ణయించింది.

Next Story