విమర్శలకు ఘాటుగా కౌంటర్ ఇచ్చిన టీటీడీ చైర్మన్ భూమన
తాను విమర్శలకు భయపడే వ్యక్తిని కాదని అన్నారు టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్రెడ్డి.
By Srikanth Gundamalla Published on 27 Aug 2023 1:51 PM IST
విమర్శలకు ఘాటుగా కౌంటర్ ఇచ్చిన టీటీడీ చైర్మన్ భూమన
టీటీడీ చైర్మన్గా ఇటీవల భూమన కరుణాకర్రెడ్డిని ఏపీ ప్రభుత్వం నియమించిన విషయం తెలిసిందే. అప్పట్నుంచే భూమన నియాకమకంపై తీవ్ర విమర్శలు వెల్లివెత్తుతున్నాయి. తాజాగా విమర్శలపై భూమన కరుణాకర్రెడ్డి స్పందించారు. ఘాటుగా కౌంటర్ ఇచ్చారు.
తాను విమర్శలకు భయపడే వ్యక్తిని కాదని అన్నారు టీటీడీ కొత్త చైర్మన్ భూమన కరుణాకర్రెడ్డి. తాను నాస్తికుడని కొందరు విమర్శలు చేస్తున్నారని.. వారికి ఇదే తన సమాధానం అని చెప్పారు. 17 సంవత్సరాల క్రితమే తాను టీటీడీ చైర్మన్ అయిన వ్యక్తిని అని చెప్పారు. 30వేల మందికి కళ్యాణమస్తు ద్వారా సామూహిక వివాహాలు చేయించానని అన్నారు. తిరుమల ఆలయ మాడవీధుల్లో చెప్పులతో వెళ్లకూడదని నిర్ణయం తీసుకున్నది తానే అని గుర్తుచేశారు భూమన కరుణాకర్రెడ్డి. అన్నమయ్య 600 వర్ధంతి ఉత్సవాలు జరిపించింది కూడా తానే అని చెప్పారు. దళితవాడల్లో శ్రీవెంకటేశ్వరస్వామి కళ్యాణం చేయించానని తెలిపారు. అయితే.. తాను క్రిస్టియన్ అంటూ.. నాస్తికుడంటూ కొందరు విమర్శలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరెవరో ఆరోపణలు చేస్తున్నారని మంచి పనులు చేయడం అస్సలు మానుకోనని చెప్పారు. పోరాటాల నుంచి పైకి వచ్చానని.. ఇలాంటి వాటికి అస్సలు భయపడే ప్రసక్తి లేదని విమర్శకులకు ఘాటుగా కౌంటర్ ఇచ్చారు టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్రెడ్డి.
తిరుమల శ్రీవారిపై ఉన్న భక్తి విశ్వాసాలను దెబ్బతీసేలా సోషల్ మీడియాలో ప్రచారం చేయడం తగదని.. దుష్ప్రచారం మానుకోవాలని టీటీడీ ఈవో ధర్మారెడ్డి అన్నారు. టీటీడీ నాలుగేళ్లలో చేసిన అభివృద్ధి, వసతుల కల్పనపై నెల రోజుల్లో ప్రదర్శన ఏర్పాటు చేస్తామని ఈవో ధర్మారెడ్డి తెలిపారు. అలా చేయడం ద్వారా విమర్శకుల నోరు మూసుకుపోతుందని చెప్పారు.