ఏటీఎం లో డబ్బులు కొట్టేయడం కష్టమే..అందుకే ఎత్తుకెళ్ళిపోతున్నారు..!

By రాణి  Published on  24 Feb 2020 10:00 AM GMT
ఏటీఎం లో డబ్బులు కొట్టేయడం కష్టమే..అందుకే ఎత్తుకెళ్ళిపోతున్నారు..!

ఏటీఎంలో డబ్బులు కొట్టేయాలని ప్రవర్తించే కేటుగాళ్ళకు ఎన్నో ఇబ్బందులు తెలెత్తుతూ ఉంటాయి. ఎంతో టెక్నాలజీతో కూడుకున్న ఏటీఎం మెషీన్ లాక్ ను ఓపెన్ చేసి డబ్బులు కొట్టేయడం అంటే సాధారణ విషయం కాదు. అందుకే చాలా మంది దొంగలు ఏటీఎం మెషీన్ నే ఎత్తుకెళ్ళిపోతూ ఉంటారు. వారికి సంబంధించిన ప్రాంతాల్లోకో.. లేదా ఊరి చివరకు తీసుకుని వెళ్ళో ఆ మెషీన్ ను పగుల గొట్టడానికి విఫలయత్నం చేస్తూ ఉంటారు. తాజాగా అలాంటి ట్రెండ్ నే సంగారెడ్డిలో ఫాలో అయ్యారు కొందరు దొంగలు.

ఇద్దరు వ్యక్తులు ముఖాలకు మాస్కులు కట్టుకుని సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు మండలంలోని రుద్రారంలోని ఏటీఎం సెంటర్ లోకి ఆదివారం అర్ధరాత్రి సమయంలో చొరబడ్డారు. అందులో ఉన్న రెండు ఏటీఎంలలో ఒక ఏటీఎం కు ఉన్న అన్ని కనెక్షన్లను తొలగించి వేశారు. వెంటనే మోసుకుని బయటకు తీసుకుని వెళ్లిపోయారు. దానిని ఒక వ్యాన్ లో వేసుకుని అక్కడి నుండి ఉడాయించారు. ఇండీక్యాష్ ఏటీఎంలో 2 లక్షల 27 రూపాయల క్యాష్ ఉన్నట్లు తెలిపారు.

ఉదయం డబ్బులు డ్రా చేసుకుందామని ఓ స్థానికుడు ఏటీఎం సెంటర్ కు రాగా.. అక్కడ రెండో ఏటీఎం కనిపించలేదు. దీంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. అక్కడికి వచ్చిన పోలీసులు సీసీటీవీ ఫుటేజీని పరిశీలించగా..ఆదివారం తెల్లవారుజామున 2:17 సమయంలో ఈ దొంగతనం చోటుచేసుకున్నట్లు గుర్తించారు. అందులోని డబ్బు తీసుకున్నాక.. ఏటీఎం మెషీన్ ను ఎక్కడైనా పారవేసి ఉంటారేమోనని పోలీసులు భావిస్తున్నారు. ఈ కేసును ఛేదించడానికి రెండు బృందాలను ఏర్పాటు చేశారు.

Next Story