ఈ ఏడాది జమ్మూలో 177 మంది ఉగ్రవాదులు హతం
By సుభాష్ Published on 17 Sep 2020 7:08 AM GMT
జమ్మూలో ఉగ్రవాద కార్యకలాపాలపై భద్రత దళాలు, పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. ప్రతి రోజు ఏదో ఒక ప్రాంతంలో ఉగ్రవాదులను భద్రతా బలగాలు మట్టుబెడుతున్నాయి. ప్రతి రోజు ఏదో ఒక చోట కాల్పులు జరగడం, అందులో ఉగ్రవాదులు హతం కావడం జరుగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో జమ్మూకశ్మీర్లో ఈ ఏడాది ఆరంభం నుంచి ఇప్పటి వరకు 177 మంది ఉగ్రవాదులు హతమైనట్లు జమ్మూ డీజీపీ దిల్బార్సింగ్ తెలిపారు. గత ఎనిమిది నెలల్లో ఒక్క శ్రీనగర్ ప్రాంతంలో నిర్వహించిన భద్రతా బలగాల ఆపరేషన్లో16 మంది ఉగ్రవాదులు హతమయ్యారని చెప్పారు. అదే విధంగా ఈ ఏడాది రాష్ట్ర వ్యాప్తంగా 72 ఆపరేషన్లు నిర్వహించామని ఆయన తెలిపారు.
తాజాగా గురువారం కూడా శ్రీనగర్లోని బాతామలూ ప్రాంతంలో ముగ్గురు ఉగ్రవాదులను భద్రతాబలగాలు హతమార్చాయి. ఈ కాల్పుల్లో ఒక సాధారణ పౌరుడు మృతి చెందగా, సీఆర్పీఎఫ్ డిప్యూటీ కమాండెంట్ తీవ్రంగా గాయపడ్డారని ఆయన వెల్లడించారు. ఉగ్రవాదుల కార్యకలాపాలు రోజురోజుకు ఎక్కువైపోతున్నాయని, వారిని మట్టుబెట్టేందుకే ప్రతి రోజు ప్రత్యేక బలగాలతో గాలిస్తున్నామని అన్నారు.