ఈ ఏడాది జమ్మూలో 177 మంది ఉగ్రవాదులు హతం
By సుభాష్ Published on 17 Sep 2020 7:08 AM GMTజమ్మూలో ఉగ్రవాద కార్యకలాపాలపై భద్రత దళాలు, పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. ప్రతి రోజు ఏదో ఒక ప్రాంతంలో ఉగ్రవాదులను భద్రతా బలగాలు మట్టుబెడుతున్నాయి. ప్రతి రోజు ఏదో ఒక చోట కాల్పులు జరగడం, అందులో ఉగ్రవాదులు హతం కావడం జరుగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో జమ్మూకశ్మీర్లో ఈ ఏడాది ఆరంభం నుంచి ఇప్పటి వరకు 177 మంది ఉగ్రవాదులు హతమైనట్లు జమ్మూ డీజీపీ దిల్బార్సింగ్ తెలిపారు. గత ఎనిమిది నెలల్లో ఒక్క శ్రీనగర్ ప్రాంతంలో నిర్వహించిన భద్రతా బలగాల ఆపరేషన్లో16 మంది ఉగ్రవాదులు హతమయ్యారని చెప్పారు. అదే విధంగా ఈ ఏడాది రాష్ట్ర వ్యాప్తంగా 72 ఆపరేషన్లు నిర్వహించామని ఆయన తెలిపారు.
తాజాగా గురువారం కూడా శ్రీనగర్లోని బాతామలూ ప్రాంతంలో ముగ్గురు ఉగ్రవాదులను భద్రతాబలగాలు హతమార్చాయి. ఈ కాల్పుల్లో ఒక సాధారణ పౌరుడు మృతి చెందగా, సీఆర్పీఎఫ్ డిప్యూటీ కమాండెంట్ తీవ్రంగా గాయపడ్డారని ఆయన వెల్లడించారు. ఉగ్రవాదుల కార్యకలాపాలు రోజురోజుకు ఎక్కువైపోతున్నాయని, వారిని మట్టుబెట్టేందుకే ప్రతి రోజు ప్రత్యేక బలగాలతో గాలిస్తున్నామని అన్నారు.