ఇండియా బుక్‌ ఆఫ్ రికార్డ్స్‌లో షర్మిలకు స్థానం

వైఎస్‌ఆర్‌టీపీ అధినేత్రి వైఎస్‌ షర్మిల ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో చోటు సంపాదించుకున్నారు.

By Srikanth Gundamalla  Published on  15 Aug 2023 10:24 AM GMT
YS Sharmila, padayatra,  india book of records,

ఇండియా బుక్‌ ఆఫ్ రికార్డ్స్‌లో షర్మిలకు స్థానం

వైఎస్‌ఆర్‌టీపీ అధినేత్రి వైఎస్‌ షర్మిల ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో చోటు సంపాదించుకున్నారు. తెలంగాణ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన షర్మిల.. రాజన్న పాలనను తెలంగాణలో తిరిగి తీసుకొస్తానని పార్టీ స్థాపించారు. తండ్రి బాటలోనే నడుస్తూ పాదయాత్ర మొఓదలు పెట్టారు. పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు రాష్ట్రవ్యాప్తంగా ప్రజా ప్రస్థానం పాదయాత్ర పేరుతో నడిచారు. వైఎస్ షర్మిల పాదయాత్రకు ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో చోటు దక్కింది. సుదీర్ఘంగా 3800 కిలోమీటర్లు పాదయాత్ర చేసినందుకు ఈ గౌరవం దక్కింది. అయితే.. 3800 కిలోమీటర్లు పాదయాత్ర చేసిన తొలి మహిళగా వైఎస్ షర్మిల రికార్డు సృష్టించారు. ఈ క్రమంలోనే ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌ ప్రతినిధులు షర్మిలకు అవార్డును ప్రదానం చేశారు.

దివంగత నాయకుడు వైఎస్‌ రాజశేఖర్‌ కూతురిగా .. ఆయన పాదయాత్ర మొదలుపెట్టిన చేవెళ్ల నుంచి 2021 అక్టోబర్‌లో ప్రజాప్రస్థానం పాదయాత్ర ప్రారంభించారు వైఎస్ షర్మిల. నిరతరాయంగా నడుస్తూ.. ప్రజల సమస్యలను తెలుసుకున్నారు. ప్రజలతో మమేకం అయ్యే ప్రయత్నం చేశారు. ఆ క్రమంలోనే ఏ నియోజవకర్గంలో పర్యటించినా.. అక్కడి ఎమ్మెల్యేలను టార్గెట్‌ చేస్తూ తీవ్ర విమర్శలు చేసేవారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేవారు షర్మిల. రాజన్న పాలన తీసుకొస్తానని.. అదే తన లక్ష్యమని చెప్పేవారు. అయితే.. పలువురు బీఆర్ఎస్‌ నాయకులు కూడా ఆమె పాదయాత్రను అడ్డుకునే ప్రయత్నాలు చేశారు. అయినా.. ఏవీ లెక్కచేయకుండా షర్మిల పాదయాత్ర కొనసాగించారు. అలా తెలంగాణలో సుదీర్ఘంగా 3800 కిలోమీటర్ల మేర వైఎస్ షర్మిల పాదయాత్ర చేశారు. అందుకు గాను షర్మిల పేరు ఇండియా బుక్‌ ఆఫ్ రికార్డ్స్‌లోకి ఎక్కింది.

అయితే.. వైఎస్‌ షర్మిల ముందుగా అనుకున్నట్లుగా మొత్తం 4,111 కిలోమీటర్ల పాదయాత్ర చేయాల్సి ఉంది. కానీ.. పలు కారణాలతో ఆమె పాదయాత్రను మధ్యలోనే ముగించారు. ఏది ఏమైనా మహిళా నాయకురాలిగా 3800 కిలోమీటర్లు నిరంతరాయంగా పాదయాత్ర చేయడం గొప్ప విషయం అని.. ఇలా నడిచిన మొదటి మహిళ షర్మిల అని ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌ ప్రతినిధులు చెప్పారు. షర్మిలను కలిసిన ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌ ప్రతినిధులు.. ఆమెను ప్రశంసించడంతో పాటు సర్టిఫికెట్‌ను అందజేశారు.

Next Story