ఇవాళ్టి నుంచి వైన్‌ షాపులు బంద్‌.. మళ్లీ ఓపెన్‌ ఎప్పుడంటే..

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు చివరి దశకు చేరుకున్నాయి.

By Srikanth Gundamalla  Published on  28 Nov 2023 5:36 AM GMT
wine, bar, closed, telangana elections,

 ఇవాళ్టి నుంచి వైన్‌ షాపులు బంద్‌.. మళ్లీ ఓపెన్‌ ఎప్పుడంటే..

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు చివరి దశకు చేరుకున్నాయి. ఇవాళ సాయంత్రం 5 గంటలకు ఎన్నికల ప్రచారం ముగియనుంది. ఆ తర్వాత ఒక్కరు కూడా రాజకీయ పరంగా ప్రచారం చేయడానికి వీలు లేదు. ఈ నెల 30వ తేదీన ఉదయం 7 గంటల నుంచే పోలింగ్ ప్రక్రియ మొదలు కానుంది. ఈ నేపథ్యంలో ఎన్నికల అధికారులు పోలింగ్‌ కోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు సమస్యాత్మక ప్రాంతాల్లో పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేస్తున్నారు. ఎన్నికలను ఏవీ ప్రభావం చేయకుండా స్వేచ్ఛగా ప్రతి ఒక్కరు ఓటు హక్కు వినియోగించుకునేలా చూస్తున్నారు. ఈ నేపథ్యంలో మద్యం ద్వారా ఎవరినీ ప్రలోభాలు పెట్టకూడదనే ఇవాళ్టి నుంచే వైన్స్‌ షాపులను క్లోజ్‌ చేస్తారు.

అసెంబ్లీ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహిస్తామని ఎన్నికల అధికారులు చెబుతున్నారు. నేటి నుంచి మూడ్రోజుల పాటు మద్యం దుకాణాలు మూసివేస్తున్నట్లు ఆదేశాలు జారీ చేశారు. కాగా.. సోమవారం నుంచి కొన్ని చోట్ల వైన్స్‌లు బంద్‌ చేసి ఉన్నాయి. ఇవాళ్టి నుంచి పూర్తిగా మూతపడనున్నాయి మద్యం దుకాణాలు. మరోవైపు నవంబర్ 30వ తేదీతోనే లిక్కర్ పాలసీ ముగుస్తుంది. పాత స్టాక్‌ ఏదైనా ఉంటే తక్కువ ధరకు అమ్మొద్దని మొన్న ఆబ్కారీ శాఖ అదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. స్టాక్‌ అయిపోయిన చోట్లలో సోమవారం నుంచి వైన్స్‌లు బంద్‌ చేయబడి ఉన్నాయి. దాదాపుగా స్టాక్‌ పూర్తయ్యిందని అంటున్నారు. వైన్స్‌లతో పాటు బార్లు కూడా ఈ నెల 30వ తేదీ సాయంత్రం వరకు మూసివేయబడే ఉంటాయని ఎన్నికల అధికారులు చెప్పారు.

ఇవాళ సాయంత్రం వరకు తెరపై ప్రచారం జరగుతుంది. ఆ తర్వాత ఒక్కరోజే ఎమ్మెల్యే అభ్యర్థులకు కీలకం అని అంటున్నారు కొందరు. తెరవెనుక ప్రలోభాలు అప్పుడే మొదలు అవుతాయని చెబుతున్నారు. ఇప్పటికే భారీగా మద్యం, డబ్బులు నియోజవకర్గాలకు చేరి ఉంటుందని పలువురు అంటున్నారు. మద్యం, డబ్బు సరఫరా చేస్తారని చెబుతున్నారు. ఈ క్రమంలోనే ఎన్నికల అధికారులు, పోలీసులు నిఘా మరింత పెంచాల్సిన అవసరం ఉంది. ఓటర్లను ప్రలోభపెట్టకుండా చూడాలని కోరుతున్నారు.

Next Story