శ్రీశైలం వెళ్లే భక్తులకు తెలంగాణ ఆర్టీసీ శుభవార్త

ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలం వెళ్లాలనుకునే భక్తులకు తెలంగాణ ఆర్టీసీ గుడ్‌ న్యూస్ చెప్పింది.

By Srikanth Gundamalla  Published on  19 July 2023 9:21 AM GMT
TSRTC Package, Srisailam, devotees, Weekends,

శ్రీశైలం వెళ్లే భక్తులకు తెలంగాణ ఆర్టీసీ శుభవార్త

ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలం వెళ్లాలనుకునే భక్తులకు తెలంగాణ ఆర్టీసీ గుడ్‌ న్యూస్ చెప్పింది. ప్రత్యేక టూర్‌ ప్యాకేజీని ప్రకటించింది. ప్రీ వీకెండ్‌కు సికింద్రాబాద్‌, జేబీఎస్‌ నుంచి ప్రత్యేక బస్సులను నడపాలని టీఎస్‌ ఆర్టీసీ నిర్ణయం తీసుకుంది. రెండ్రోజుల పాటు ఈ టూర్‌ కొనసాగుతుంది. అయితే.. సదుపాయాన్ని జూలై 22 నుంచి అందుబాటులోకి తీసుకున్నట్లు అధికారులు ప్రకటించారు. ప్యాకేజీ టూర్‌లో భాగంగా శ్రీశైలం మల్లికార్జున స్వామి, భ్రమరాంబదేవి, సాక్షి గణపతి ద‌ర్శ‌నంతో పాటు పాతాళ‌గంగా, పాలధార, పంచధార, శిఖరం, శ్రీశైలం డ్యాం, తదితర ప్రాంతాలను కూడా భక్తులు సందర్శించుకోవచ్చు.

ఈ టూర్‌ ప్యాకేజీ ధరను కూడా ప్రకటించింది ఆర్టీసీ సంస్థ. పెద్దలకు రూ.2700, పిల్లలకు రూ.1570గా ఖరారు చేసింది. ప్రతి శనివారం ఉదయం ఈ టూర్‌ ప్రారంభమవుతుంది. తొలి రోజు హైదరాబాద్‌లోని జేబీఎస్‌ నుంచి ఉదయం 7 గంటలకు సూపర్‌ లగ్జరీ బస్సు బయలుదేరుతుంది. 8 గంటలకు ఎంజీబీఎస్‌ చేరుకుంటుంది. అక్కడి నుంచి మధ్యాహ్నం 1.30 గంటలకు శ్రీశైలానికి చేరుకుని.. బస కోసం నేరుగా హోటల్‌కు వెళ్తుంది. మధ్యాహ్న భోజనం పూర్తయ్యాక.. 3 గంటలకు పాతాళగంగకు భక్తులను తీసుకెళ్తారు. కృష్ణానదిలో బోటింగ్‌ కూడా చేయిస్తారు. సాయంత్రం 5 గంటలకు శ్రీ మల్లికార్జున స్వామి, శ్రీ భ్రమరాంబిక అమ్మ వారి దర్శనాన్ని భక్తులు చేసుకోవాలి. భక్తుల కొరకు శీఘ్ర దర్శన సదుపాయం అక్కడ అందుబాటులో ఉంటుంది. రాత్రి భోజనం అనంతరం శ్రీశైలంలోనే హోటల్‌లో బస ఉంటుంది.

రెండో రోజు ఉదయం 5 నుంచి 8 గంటల వరకు భక్తులు ఆలయంలో అభిషేకం, ప్రత్యేక పూజలు చేసుకోవచ్చు. అనంతరం.. టిఫిన్‌ పూర్తవగానే హోటల్‌ చెక్‌అవుట్‌ చేయాల్సి ఉంటుంది. అక్కడి నుంచి శివాజి స్ఫూర్తి కేంద్రం, చెంచులక్ష్మి ట్రైబల్‌ మ్యూజియం సందర్శన ఉంటుంది. ఆ తర్వాత సాక్షి గణపతి ఆలయ దర్శనంతో పాటు పాలధార, పంచధార, శిఖరం, శ్రీశైలం డ్యాం, తదితర ప్రాంతాలను సందర్శిస్తారు. మార్గమధ్యంలో మధ్యాహ్న భోజనం చేసిన తర్వాత రాత్రి 7.30 గంటలకు ఎంజీబీఎస్‌కు, 8.30 గంటలకు జేబీఎస్‌కు బస్సు చేరుకుంటుంది.

రవాణా, వసతి, ఆలయ శీఘ్ర దర్శనం, శిఖరం ప్రవేశ రుసుం ఈ మొత్తం కూడా ప్యాకేజీలో చేర్చబడింది. అయితే ఆహారం, ఆలయంలో అభిషేకం, ప్రత్యేక పూజలు, ఇతర ఖర్చులను ప్రయాణికులే భరించాల్సి ఉంటుంది.

"ప్రముఖ శైవ క్షేత్రం శ్రీశైలంకు భక్తులు పెద్ద ఎత్తున వెళ్తుంటారు. హైదరాబాద్‌ నుంచి ప్రతి రోజు శ్రీశైలానికి 40 సర్వీసులను టీఎస్‌ఆర్టీసీ నడుపుతోంది. వీకెండ్‌లో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుందని తెలుసుకున్న సంస్థ యజమాన్యం ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలోనే శ్రీశైలం వెళ్లాలనుకునే వారికోసం ప్రత్యేకంగా టూర్‌ ప్యాకేజీని అందించాలని సంస్థ నిర్ణయించింది. ఈ ప్రత్యేక టూర్‌ ప్యాకేజీని భక్తలందరూ వినియోగించుకోవాలని టీఎస్‌ ఆర్టీసీ అధికారులు విజ్ఞప్తి చేశారు. టీఎస్‌ఆర్టీసీ అధికారిక వెబ్‌సైట్‌ tsrtconline.inలోకి వెళ్లి మీ టికెట్లను బుకింగ్‌ చేసుకోవాలి. ఈ టూర్‌ ప్యాకేజీకి సంబంధించిన పూర్తి వివరాలకు టీఎస్‌ఆర్టీసీ కాల్‌ సెంటర్‌ నంబర్లు 040-69440000, 040-23450033ను సంప్రదించాలి." అని టీఎస్‌ఆర్టీసీ చైర్మన్‌, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్‌, సంస్థ ఎండీ వీసీ సజ్జనార్‌, ఐపీఎస్‌ సూచించారు.

Next Story