టీఎస్ ఆర్టీసీ గుడ్‌న్యూస్‌.. సంక్రాంతి వరకు 200 కొత్త బస్సులు

తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత మహాలక్ష్మి పథకం తీసుకొచ్చిన విషయం తెలిసిందే.

By Srikanth Gundamalla  Published on  23 Dec 2023 12:56 AM GMT
tsrtc, 200 new buses, md sajjanar, bus bhavan,

టీఎస్ ఆర్టీసీ గుడ్‌న్యూస్‌.. సంక్రాంతి వరకు 200 కొత్త బస్సులు

తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత మహాలక్ష్మి పథకం తీసుకొచ్చిన విషయం తెలిసిందే. అయితే.. ఈ పథకంలో భాగంగా మహిళలందరికీ ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సదుపాయం కల్పించారు. దాంతో.. ఆర్టీసీ బస్సుల్లో రద్దీ విపరీతంగా పెరిగిపోయింది. కొన్ని రూట్లలో అయితే బస్సుల్లో కాలు పెట్టే చోటు కూడా ఉండటం లేదు. దాంతో.. ప్రయాణికులు ఆర్టీసీ అధికారులు, ప్రభుత్వానికి అర్జీ పెట్టుకుంటున్నారు. తమ రూట్‌లో కొత్త బస్సులను వేయాలని కోరారు. ఈ నేపథ్యంలో స్పందించిన ఆర్టీసీ సంస్థ అందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే అద్దె బస్సులకు ప్రకటన ఇచ్చింది. తాజాగా 200 బస్సులను సంక్రాంతి నాటికి అందుబాటులోకి తీసుకురానున్నట్లు వెల్లడించింది.

ప్రయాణికుల సౌకర్యార్థం సంక్రాంతి నాటికి 200 కొత్త డీజిల్‌ బస్సులను అందుబాటులోకి తెస్తామని తెలంగాణ ఆర్టీసీ ప్రకటించింది. వీటిలో వారం రోజుల్లో 50 బస్సులను రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ప్రజలకు మెరుగైన, సౌకర్యవంతమైన ప్రయాణ అనుభూతిని కలిగించేందుకు ఈ బస్సులను అందుబాటులోకి తెస్తోంది ఆర్టీసీ సంస్థ.

హైదరాబాద్‌లోని బస్‌భవన్‌ ప్రాంగణంలో కొత్త లభహరి స్లీపర్‌ కమ్ సీటర్‌, రాజధాని ఏసీ, ఎక్స్‌ప్రెస్‌ బస్సులన ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్‌ పరిశీలించారు. బస్సుల్లో ప్రయాణికులకు ఉన్నటువంటి సదుపాయాలను గురించి అడిగి తెలుసుకున్నారు. వారికి ఈ సందర్భంగా ఆర్టీసీ ఎండీ సజ్జనార్ పలు సూచనలు కూడా చేశారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం స్కీమ్‌ అమలులో ఉన్న నేపథ్యంలో ప్రయాణికుల రద్దీ పెరిగిందనీ.. వీలైనంత త్వరగా బస్సులను అందుబాటులోకి తీసుకురావాలని చెప్పారు. అంతేకాదు.. నాలుగైదు నెలల్లో మరో 2వేలకు పైగా కొత్త బస్సులను అందుబాటులోకి తేవాలని ఆర్టీసీ ప్రయత్నిస్తోంది. అందులో 400 ఎక్స్ ప్రెస్, 512 పల్లె వెలుగు, 92 లహరి స్లీపర్ కమ్ సీటర్, 56 ఏసీ రాజధాని బస్సులున్నాయని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ అన్నారు. ఎలక్ట్రిక్ వాహనాల విషయానికి వస్తే హైదరాబాద్ సిటీలో 540, తెలంగాణలో ఇతర ప్రాంతాలకు 500 బస్సులను వాడకంలోకి యాజమాన్యం తెస్తోందని చెప్పారు. వీటిన్నటిని వచ్చే ఏడాది మార్చి చివరి నాటికి అందుబాటులోకి తీసుకువచ్చేలా ప్రణాళికలు రూపొందించామని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు.


Next Story