తెలంగాణ గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ రద్దు చేసిన హైకోర్టు

తెలంగాణలో గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ పరీక్షను రద్దు చేసి.. మరోసారి పరీక్ష నిర్వహించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

By Srikanth Gundamalla  Published on  23 Sep 2023 6:08 AM GMT
tspsc group-1, prelims cancelled, Telangana High Court,

తెలంగాణ గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ రద్దు చేసిన హైకోర్టు

తెలంగాణ పబ్లిక్ సర్వీస్‌ కమిషన్ నిర్వహించిన గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ పరీక్షను రద్దు చేసి.. మరోసారి పరీక్ష నిర్వహించాలని తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. జూన్ 11న తెలంగాణ వ్యాప్తంగా ఈ పరీక్షకు 2.33 లక్షల మందికి పైగా అభ్యర్థులు హాజరైన విషయం తెలిసిందే. మొత్తం 53 గ్రూప్‌-1 పోస్టు భర్తీ కోసం ఈ పరీక్షను టీఎస్‌పీఎస్‌సీ నిర్వహించింది. అయితే, గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్ష రద్దు చేసి, మళ్లీ నిర్వహించాలని హైకోర్టులో పలువురు అభ్యర్థులు పిటిషన్‌లు వేశారు. పరీక్షలో బయోమెట్రిక్ వివరాలు తీసుకోలేదని హైకోర్టుకు తెలిపారు. అంతేకాకుండా హాల్‌ టికెట్‌ నంబర్‌ లేకుండా ఓఎంఆర్‌ షీట్లు ఇచ్చారని హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు అభ్యర్థులు. ఈ అభ్యర్థుల పిటిషన్‌పై విచారణ జరిపిన తెలంగాణ హైకోర్టు తాజాగా తీర్పును వెలువరించింది. పరీక్షను మళ్లీ నిర్వహించాలని ఆదేశించింది.

రాష్ట్రవ్యాప్తంగా 994 కేంద్రాల్లో ఈ పరీక్ష నిర్వహించారు. పరీక్షకు 3,80,081 మంది దరఖాస్తు చేసుకోగా 2,33,248 మందే హాజరయ్యారు. హాజరు శాతం 61.37గా నమోదైంది. కాగా.. పేపర్‌ లీకేజీ కారణంగా గ్రూప్‌ - 1 పరీక్ష ఇంతకుముందే ఓసారి రద్దైన సంగతి తెలిసిందే. లీకేజీ వ్యవహారం తర్వాత ప్రిలిమ్స్‌ పరీక్షను మళ్లీ నిర్వహించింది టీఎస్‌పీఎస్‌సీ. ఈ నేపథ్యంలో అన్ని పరీక్ష కేంద్రాల్లో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. నిబంధనలను కఠినంగా అమలు చేశారు. గత గ్రూప్‌-1 ప్రిలిమినరీ పరీక్షలో అభ్యర్థుల బయోమెట్రిక్‌ తీసుకోగా ఈసారి అలా చేయలేదు. దీనిపై పలువురు అభ్యర్థులు తాజాగా తెలంగాణ హైకోర్టును ఆశ్రయించగా.. గ్రూప్‌-1 ప్రిలిమినరీ పరీక్షలు మరోసారి నిర్వహించాలని ఆదేశించింది.


Next Story