Telangana: పొదల్లోకి దూసుకెళ్లిన బస్సు.. తప్పిన ప్రమాదం
రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురైంది.
By Srikanth Gundamalla Published on 5 Jun 2024 12:15 PM IST
Telangana: పొదల్లోకి దూసుకెళ్లిన బస్సు.. తప్పిన ప్రమాదం
రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురైంది. బస్సు ఒక్కసారిగా అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న పొదల్లోకి దూసుకెళ్లింది. అయితే.. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. ఈ బస్సు ప్రమాదం స్థానికంగా కలకలం రేపుతోంది.
రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలంలో ఆర్టీసీ బస్సుకు ప్రమాదం జరిగింది. పద్మనగర్ వద్ద బస్సు అదుపు తప్పింది. సిద్దిపేట డిపోకు చెందిన ఆర్టీసీ పల్లె వెలుగు బస్సు పద్మనగర్ గ్రామ శివారులోని పెట్రోల్ బంక్ వద్దకు రాగానే కుడివైపుగా రోడ్డు దిగిపోయింది. చెట్ల పొదల్లోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 35 మంది వరకు ప్రయాణికులు ఉన్న్నట్లు తెలుస్తోంది. అయితే.. ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. ప్రయాణికులు అంతా క్షేమంగా బయటపడటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ సంఘటన బుధవారం ఉదయం 5.30 గంటలకు జరిగిందని ప్రయాణికులు చెబుతున్నారు.
ఇక ఈ సంఘటనపై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే బస్సు ప్రమాదానికి గురైందని చెబుతున్నారు. అతివేగంగా బస్సు నడిపాడని.. అందుకే ప్రమాదం జరిగిందంటున్నారు. ర్యాష్ డ్రైవింగ్ చేశాడని అంటున్నారు. ఇక కండక్టర్ ఈ ప్రమాదంపై మాట్లాడుతూ.. తనకు కూడా ఏం జరిగిందనేది పూర్తిగా తెలియదనీ ప్రయాణికులతో పాటే కూర్చున్నానని అన్నారు. బస్సు వేగంగా లేదని ప్రమాదం మాత్రం జరిగిందని అన్నారు. డ్రైవర్ కూడా బస్సు ఒక పక్క నెట్టుకు వచ్చిందని ప్రమాదం చోటుచేసుకుందని వివరణ ఇచ్చాడు.
రాజన్న సిరిసిల్ల తంగళ్లపల్లి మండలం పద్మనగర్ వద్ద ఆర్టీసీ బస్సు ప్రమాదం
— Newsmeter Telugu (@NewsmeterTelugu) June 5, 2024
అదుపుతప్పి పొదల్లోకి దూసుకెళ్లిన బస్సు, క్షేమంగా బయటపడ్డ ప్రయాణికులు pic.twitter.com/X633b88r8P