ప్రవల్లిక సూసైడ్‌ ఘటనపై ప్రభుత్వం స్పందించాలి: రేవంత్‌రెడ్డి

గ్రూప్‌-2 విద్యార్థి ప్రవల్లిక ఆత్మహత్య ఘటనపై ప్రభుత్వం స్పందించాలని రేవంత్‌రెడ్డి ట్వీట్‌ చేశారు.

By Srikanth Gundamalla  Published on  14 Oct 2023 4:26 AM GMT
revanth reddy, tweet,  group-2 student, pravallika suicide,

ప్రవల్లిక సూసైడ్‌ ఘటనపై ప్రభుత్వం స్పందించాలి: రేవంత్‌రెడ్డి

తెలంగాణలో గ్రూప్‌-2 పరీక్ష వాయిదా పడింది. దాంతో తీవ్ర మనస్థాపానికి గురైన విద్యార్థిని ప్రవల్లిక హైదరాబాద్‌లో సూసైడ్ చేసుకున్న విషయం తెలిసిందే. రాష్ట్రంలో ప్రస్తుతం విద్యార్థిని ఆత్మహత్య సంచలనంగా మారింది. అశోక్‌నగర్‌లో తాను ఉంటున్న హాస్టల్‌లో ఆత్మహత్య చేసుకోవడంతో అక్కడికి పెద్ద ఎత్తున విద్యార్థులు వెళ్లారు. అర్ధరాత్రి దాటే వరకు ఆందోళనలు చేశారు. రోడ్డును బ్లాక్‌ చేసి నిరసనలు తెలిపారు. ప్రవల్లికది ప్రభుత్వ హత్యే అని.. గ్రూప్స్‌ పరీక్షలు వాయిదా వేయడాన్ని తప్పుబట్టారు. పరీక్షలు నిర్వహించడంలో ప్రభుత్వం విఫలమైందంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. చిక్కడిపల్లిలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొనగా.. పోలీసుల బందోబస్తు మధ్య ప్రవల్లిక మృతదేహాన్ని ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఆ తర్వాత వరంగల్‌ జిల్లాలోని ఆమె స్వగ్రామానికి డెడ్‌బాడీ తరలించారు. అయితే.. ప్రవల్లిక సూసైడ్‌ ఘటనపై ప్రతిపక్షాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ వైఫల్యమే కారణమంటూ ఆరోపణలు చేస్తున్నారు.

ఈ మేరకు తెలంగాణ కాంగ్రెస్‌ చీఫ్‌ రేవంత్‌రెడ్డి ఎక్స్‌ (ట్విట్టర్‌)లో పోస్టు పెట్టారు. ఈ ఘటనపై సీఎం కేసీఆర్‌ ప్రభుత్వాన్ని నిందిస్తూ రేవంత్‌రెడ్డి ఫైర్‌ అయ్యారు. అశోక్‌నగర్‌లో ఆత్మహత్య చేసుకున్న ఆడబిడ్డ ప్రవల్లిక తరఫున న్యాయం కావాలంటూ వేల గొంతులు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాయని అన్నారు రేవంత్. అయితే.. అంతమంది గొంతులు సీఎం కేసీఆర్ చెవికి వినపడటం లేదా అని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ పాలనలో మనుషుల ప్రాణాలకు విలువ లేదంటూ ఫైర్ అయ్యారు. రాక్షస పాలనలో హత్యలు, ఆత్మహత్యలు, అత్యాచారాలు తప్ప యువతకు భవిత లేదంటూ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. విద్యార్థులకు భవిత లేదన్న విషయం ప్రవల్లిక సూసైడ్‌ నోట్‌ చూస్తేనే అర్థం అవుతోందని రేవంత్‌రెడ్డి అన్నారు. ప్రవల్లిక ఆత్మహత్య సంఘటనపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలని ఆయన డిమాండ్ చేశారు. అలాగే కొందరు కేసును పక్కదోవ పట్టించే ప్రయత్నాలు చేసే అవకాశం ఉందని.. అలా చేస్తూ తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని ఎక్స్‌ వేదికగా టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి హెచ్చరించారు. అశోక్‌ నగర్‌లో అర్ధరాత్రి దాటే వరకు విద్యార్థులు ఆందోళనలు చేస్తున్న వీడియోను కూడా షేర్‌ చేశారు.

Next Story