రాజకీయాలు, ఆ వ్యక్తులతో నాకు సంబంధం లేదు: రకుల్‌ ప్రీత్‌సింగ్

కొండా సురేఖ టాలీవుడ్‌లో పలువురి గురించి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.

By Srikanth Gundamalla  Published on  3 Oct 2024 12:45 PM GMT
రాజకీయాలు, ఆ వ్యక్తులతో నాకు సంబంధం లేదు: రకుల్‌ ప్రీత్‌సింగ్

తెలంగాణ కాంగ్రెస్ మంత్రి కొండా సురేఖ టాలీవుడ్‌లో పలువురి గురించి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. దీనిపై టాలీవుడ్ ప్రముఖలందరి నుంచి తీవ్రంగా విమర్శలు వస్తున్నాయి. తాజాగా ఇదే అంశంపై హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ కూడా స్పందించింది. ఆమె కామెంట్స్‌ను ఖండించింది. ఎక్స్‌లో పలు విషయాలను రకుల్ రాసుకొచ్చింది.

ప్రపంచవ్యాప్తంగా సృజనాత్మకతకి.. నైపుణ్యానికి తెలుగు సినిమా ఇండస్ట్రీని ప్రతీకగా చూస్తున్నారని రకుల్ ప్రీత్‌సింగ్ ఎక్స్‌లో రాసుకొచ్చారు. తాను టాలీవుడ్ ఇండస్ట్రీలో కొన్నేళ్ల నుంచి ఉన్నాననీ.. చాలా కాలం ప్రయాణించానని అన్నారు. ఇంకా అది కొనసాగుతోందని పేర్కొన్ఆరు. ఇలాంటి ఇండస్ట్రీలో మహిళల గురించి నిరాధారమైన ఆరోపణలు చేయడం దుర్మార్గంగా పుకార్లు వ్యాపింపచేయడం దారుణమని రకుల్ ప్రీత్ సింగ్ అన్నారు. మరి దారుణమైన విషయం ఏంటంటే అవి ఇంకొక బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న మహిళ నుండి వినడం ఇంకా మనసు విరిచేసేలా ఉందని వ్యాఖ్యానించారు. గౌరవం కోసం నోరు తెరవకుండా ఉంటే దాన్ని బలహీనతగా చూస్తున్నారంటూ రకుల్ ప్రీత్‌సింగ్ మండిపడ్డారు.

అయితే.. తనకు రాజకీయాలతో ఎటువంటి సంబంధం లేదని ఈ సందర్భంగా రకుల్ ప్రీత్ సింగ్ చెప్పుకొచ్చారు. రాజకీయాలకు సంబంధించిన వ్యక్తులతో కానీ, పార్టీలతో కానీ ఎటువంటి సంబంధం లేదన్నారు. తన పేరు ని తప్పుడు ఆరోపణలతో రాజకీయాల కోసం వాడుకోవడం ఆపేయండని ఎక్స్‌లో కోరారు రకుల్ ప్రీత్‌సింగ్. ఆర్టిస్ట్‌ల‌ను ఈ రాజకీయాల నుంచి దూరంగా ఉంచాలనీ... రాజకీయ విమర్శల కోసం తమను వివాదాల్లోకి లాగొద్దని రకుల్‌ ప్రీత్‌సింగ్ అన్నారు.



Next Story