మాదాపూర్ డ్రగ్స్ కేసులో విచారణకు నటుడు నవదీప్

మాదాపూర్ డ్రగ్స్ కేసులో విచారణ నిమిత్తం నటుడు నవదీప్ నార్కోటిక్స్‌ పోలీసుల ఎదుట హాజరయ్యారు.

By Srikanth Gundamalla
Published on : 23 Sept 2023 1:00 PM IST

Madhapur Drugs Case, Narcotic Police, Enquiry, navadeep,

 మాదాపూర్ డ్రగ్స్ కేసులో విచారణకు నటుడు నవదీప్

మాదాపూర్ డ్రగ్స్ కేసులో విచారణ నిమిత్తం టాలీవుడ్ నటుడు నవదీప్ నార్కోటిక్స్‌ పోలీసుల ఎదుట హాజరయ్యారు. ఈ డ్రగ్స్ కేసులో కీలకంగా ఉన్న నవదీప్ కు హైకోర్టు ఆదేశాల మేరకు నార్కో టిక్ పోలీసులు 41ఏ నోటీసులు జారీ చేశారు. సెప్టెంబర్ 23వ తేదీన హెచ్ న్యూ కార్యాలయానికి విచారణ నిమిత్తం రావాలని నోటీసులు ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే నవదీప్ హెచ్ న్యూ ఆఫీస్‌లో విచారణకు హాజరయ్యారు.

మాదాపూర్ డ్రగ్స్ కేసులో కీలకంగా ఉన్న నవదీప్ కొన్ని రోజులపాటు పరారీలో ఉన్నట్లుగా పోలీసులు చెప్పారు. కానీ తాను ఎక్కడికి వెళ్లలేదని హైదరాబాదులోనే ఉన్నానని నవదీప్ వెల్లడించాడు. అంతేకాదు.. ఈకేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదంటూ తనను అరెస్టు చేయవద్దు అంటూ హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈ మేరకు నవదీప్ దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు విచారణ జరిపి అధికారుల విచారణకు సహకరించాలని పేర్కొంది. అంతేకాకుండా హైకోర్టు నవదీప్‌కు 41ఏ నోటీసులు జారీ చేయాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. దీంతో నార్కోటిక్ బృందం శనివారం విచారణ కోసం కార్యాలయానికి విచారణకు రావాలని నోటీసులు జారీ చేయడం జరిగింది. దాంతో.. నోటీసులు అందుకున్న నవదీప్ విచారణ నిమిత్తం అధికారుల ఎదుట హాజరయ్యారు.

ప్రస్తుతం మాదాపూర్‌ డ్రగ్స్‌ కేసులో నవదీప్‌ను నార్కోటిక్స్‌ పోలీసులు ప్రశ్నిస్తున్నారు. నవదీప్‌ ముందు 20 ప్రశ్నలు ఉంచినట్లు తెలుస్తోంది. రాంచంద్‌తో ఉన్న పరిచయాలపై ఆరా తీస్తున్నారు అధికారులు. నవదీప్‌, రాంచంద్‌ ఇద్దరూ అత్యంత సన్నిహితులనీ నార్కోటిక్స్‌ పోలీసుల విచారణలో తేలింది. దాంతో.. ఇద్దరి మధ్య అనుబంధంపై ఆరా తీస్తున్నారు. అయితే.. ఇద్దరు కలిసి ఎప్పుడు, ఎక్కడ? ఎలా డ్రగ్స్ తీసుకున్నారని పోలీసులు ప్రశ్నిస్తున్నారు. రాంచంద్‌ను చివరిసారిగా ఎప్పుడు కలిశావని నవదీప్‌ను ప్రశ్నించనున్నారు. మాజీ ఎంపీ విఠల్‌రావు కుమారుడు సురేశ్‌తో ఉన్న పరిచయాలపైనా ఆరా తీస్తున్నారు. ముగ్గురూ కలిసి ఎప్పుడైనా డ్రగ్స్‌ తీసుకున్నారా అని నార్కొటిక్స్ పోలీసులు నవదీప్‌ను ప్రశ్నిస్తున్నారు.

Next Story