Karimnagar: ప్రతిమ మల్టీప్లెక్స్‌లో సోదాలు, రూ.6.65 కోట్లు సీజ్

కరీంనగర్‌లోని ప్రతిమ మల్టీప్లెక్స్‌లో పోలీసులు తనిఖీలు చేశారు.

By Srikanth Gundamalla  Published on  16 March 2024 4:45 AM GMT
karimnagar, police, raids,  prathima multiplex,

Karimnagar: ప్రతిమ మల్టీప్లెక్స్‌లో సోదాలు, రూ.6.65 కోట్లు సీజ్ 

కరీంనగర్‌లోని ప్రతిమ మల్టీప్లెక్స్‌లో పోలీసులు తనిఖీలు చేశారు. శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వత సోదాలు చేసిన పోలీసులు.. శనివారం ఉదయం వరకు కొనసాగించారు. పక్కా సమాచారంతోనే తాము తనిఖీలు చేసినట్లు పోలీసులు చెబుతున్నారు. అయితే.. ప్రతిమ మల్టీప్లెక్స్‌ కరీంనగర్‌ బీఆర్ఎస్‌ ఎంపీ అభ్యర్థి వినోద్‌ కుమార్‌ కుటుంబ సభ్యులకు చెందినదిగా చెబుతున్నారు. అయితే.. ఈ తనిఖీల్లో రూ.6.65 కోట్ల నగదుని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సీజ్ చేసిన నగదు మొత్తాన్ని పోలీసులు కోర్టులో డిపాజిట్ చేయనున్నారు.

కాగా.. ప్రతిమ మల్టీప్లెక్స్‌లోని పార్కింగ్ సెల్లార్‌ నుంచి డబ్బులు తరలిస్తున్న సమయంలో పోలీసులు పట్టుకున్నట్లు సమాచారం. ఈ తనిఖీల్లో రూ.6.65 కోట్ల నగదుని పోలీసులు సీజ్ చేశారు. అయితే.. దేశంలో లోక్‌సభ ఎన్నికలకు మరికొద్ది గంటల్లో నోటిఫికేషన్‌ విడుదల కానుంది. ఈ నేపథ్యంలో కరీంనగర్‌లో నగదు పట్టుబడటం కలకలం రేపుతోంది. అదీకాక.. బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వినోద్‌ కుమార్‌ కుటుంబ సభ్యులకు చెందిన మల్టీప్లెక్స్‌లో నగదు సీజ్‌ చేయడంతో పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇక ఈ సోదాల్లో నగదు పట్టుబడటంతో సీపీ అభిషేక్‌ మహంతి అక్కడికి వెళ్లారు. పోలీసులు సీక్రెట్‌గానే ఈ తనిఖీలు చేశారు. ఇక డబ్బులను సీజ్ చేసినట్లుగా కరీంనగర్ టౌన్ ఏసీపీ నరేందర్ ధృవీకరించారు. పట్టుబడ్డ నగదు ఎవరిది? ఎందుకు తీసుకొచ్చారు? ఎక్కడికి తీసుకెళ్తున్నారు? ఇలా మరిన్ని విషయాలపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


Next Story