ఇవాళ ఉప్పల్‌లో ఐపీఎల్ మ్యాచ్‌.. మెట్రో రైళ్ల సమయం పొడిగింపు

ఉప్పల్‌లో ఐపీఎల్ మ్యాచ్‌ ఉన్న సందర్భంగా మెట్రో సమయాన్ని పొడిగిస్తున్నట్లు యాజమాన్యం వెల్లడించింది.

By Srikanth Gundamalla  Published on  27 March 2024 8:19 AM GMT
hyderabad metro, time extended,  ipl match,

ఇవాళ ఉప్పల్‌లో ఐపీఎల్ మ్యాచ్‌.. మెట్రో రైళ్ల సమయం పొడిగింపు

హైదరాబాద్‌లో మెట్రో రైలు అందుబాటులోకి వచ్చాక చాలా మందికి ప్రయాణం సుఖవంతం అయ్యింది. ఒకప్పుడు ట్రాఫిక్‌లో ఎంత ఇబ్బందులు ఉన్నా వెళ్లాల్సి వచ్చేంది. కొన్నిసార్లు ట్రాఫిక్ జామ్‌ అయితే గంటల కొద్ది వేచి చూడాల్సి వచ్చేది. అయితే.. మెట్రో రైలు అందుబాటులోకి రావడంతో కొంత మేర ట్రాఫిక్ తగ్గింది. ఇక ముఖ్యంగా వేసవిలో చాలా మంది మెట్రో రైలునే ఎంచుకుంటుంటారు. ఎండ వేడిమి నుంచి తప్పించుకునేందుకు మెట్రోల్లో ప్రయాణిస్తుంటారు. ఇక హైదరాబాద్ మెట్రో యాజమాన్యం కూడా ప్రయాణికులకు వివిధ రకాలుగా వెసులుబాటు కల్పిస్తోంది.

న్యూఇయర్‌, నాంపల్లి ఎగ్జిబిషన్‌ జరిగిన రోజుల్లో మెట్రో రైలు సమయాలను పొడిగించారు మెట్రో అధికారులు. ప్రయాణికులు తమ గమ్యస్థానాలకు చేర్చింది. ఇలా ఏదైన విశేషం ఉన్న వేళ పరిస్థితులకు అనుగుణంగా మెట్రో సమయాలను యాజమాన్యం పొడిగిస్తూ వస్తోంది. తాజాగా హైదరాబాద్‌లోని ఉప్పల్‌ స్టేడియంలో బుధవారం రాత్రి ఐపీఎల్ మ్యాచ్ జరుగబోతుంది. ఈ క్రమంలోనే క్రికెట్‌ ఫ్యాన్స్‌ పెద్ద ఎత్తున ఈ మ్యాచ్‌ చూడటానికి వెళ్తుంటారు. ఇక మ్యాచ్‌ అయిపోయే సరికి 11 గంటలు దాటుతుంది. ఇక ప్రేక్షకులకు అంతా బయటకు వచ్చే సరికి ఇంకాస్త సమయం ఎక్కువే అవుతుంది. ఆ సమయంలో క్రికెట్‌ మ్యాచ్‌ను వీక్షించి ఇళ్లకు వెళ్లే వారి కోసం మెట్రో యాజమాన్యం బుధవారం రాత్రి మెట్రో సమయాన్ని పొడిగించింది.

ఈ సందర్భంగా మెట్రో రైలు యాజమాన్యం ప్రకటన చేసింది. ఉప్పల్‌లో ఐపీఎల్ మ్యాచ్‌ ఉన్న సందర్భంగా మెట్రో సమయాన్ని పొడిగిస్తున్నట్లు వెల్లడించింది. ఉప్పల్‌ మార్గంలో రైలు సమయాలను పొడిగించారు. నాగోల్‌, ఉప్పల్ స్టేడియం, ఎన్‌జీఆర్‌ఐ స్టేషన్లలో చివరి రైళ్లు రాత్రి 12:15 గంటలకు బయల్దేరి 1:10 గంటలకు గమ్యస్థానాలకు చేరుకుంటాయని హైదరాబాద్ మెట్రో అధికారులు తెలిపారు.


Next Story