సైబరాబాద్‌ పరిధిలో న్యూఇయర్‌ ఆంక్షలు: సీపీ అవినాశ్ మహంతి

న్యూఇయర్ వేడుకులకు అంతా సిద్ధం అవుతున్నారు. పలువురు నిర్వాహకులు పోలీసుల అనుమతి తీసుకుని.. ఈవెంట్లు నిర్వహిస్తున్నారు.

By Srikanth Gundamalla
Published on : 31 Dec 2023 3:37 PM IST

cyberabad, police commissioner, avinash mahanthi, new year, restrictions,

సైబరాబాద్‌ పరిధిలో న్యూఇయర్‌ ఆంక్షలు: సీపీ అవినాశ్ మహంతి

న్యూఇయర్ వేడుకులకు అంతా సిద్ధం అవుతున్నారు. ఇప్పటికే పలువురు నిర్వాహకులు పోలీసుల అనుమతి తీసుకుని.. ఈవెంట్లు నిర్వహిస్తున్నారు. ప్రభుత్వాలు కూడా మద్యం దుకాణాల సమయాలను పెంచాయి. ఈ నేపథ్యంలో పోలీసులు కీలక ఆదేశాలు జారీ చేశారు. డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ నిర్వహణతో పాటు పలు ఆంక్షలు అమల్లో ఉంటాయని చెప్పారు. ఈ నేపథ్యంలో సైబరాబాద్‌ సీపీ అవినాశ్‌ మహంతి పలు కీలక వ్యాఖ్యలు చేశారు.

నూతన సంవత్సరం సందర్భంగా సైబరాబాద్‌ పరిధిలో పలు ఆంక్షలు అమల్లో ఉంటాయని చెప్పారు సీపీ అవినాశ్ మహంతి. నేటి రాత్రి 8 గంటల నుంచి డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ తనిఖీలు ఉంటాయని వెల్లడించారు. అలాగే ఫ్లై ఓవర్లు, పీవీ ఎక్స్‌ప్రెస్‌ హైవే, ఔటర్‌ రింగ్‌ రోడ్డు (ఓఆర్ఆర్)పై ఆంక్షలు కొనసాగుతాయని సీపీ అవినాశ్ మహంతి చెప్పారు. ఓఆర్ఆర్ నుంచి శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు వెళ్లే వారికి మాత్రం అనుమతి ఉంటుందని చెప్పారు. అయితే.. ఎయిర్‌పోర్టుకు వెళ్లే వారు ప్రయాణ టికెట్లు చూపించాల్సి ఉంటుందని సీపీ అవినాశ్ మహంతి స్పష్టం చేశారు.

న్యూఇయర్ సందర్భంగా కొందరు ఆకతాయిలు రోడ్లపై స్టంట్స్ చేస్తారనీ.. ఇలాంటి వారిని ఉపేక్షించబోమని అన్నారు సీపీ అవినాశ్ మహంతి. రోడ్లపై స్టంట్లు చేసే వారిని, మితిమీరిన వేగంతో ప్రయాణించే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ర్యాష్‌ డ్రైవింగ్‌ను గుర్తించేందుకు ప్రత్యేక కెమెరాలను అమరుస్తున్నట్లు వెల్లడించారు. న్యూ ఇయర్ వేడుకలు జరుపుకొనేందుకు అనుమతి కోరిన వారికి తగిన సూచనలు ఇప్పటికే చేశామని అవినాశ్ మహంతి చెప్పారు. ఇతరులకు ఇబ్బందులు కలిగించకుండా వేడుకలు జరుపుకోవాలని అన్నారు. ఇక డ్రగ్స్‌ విషయంలో పబ్‌ల యాజమాన్యాలు బాధ్యతతో వ్యవహరించాలని సూచించారు సైబరాబాద్ సీపీ అవినాశ్ మహంతి.

Next Story