పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉపఎన్నిక కౌంటింగ్పై బీఆర్ఎస్ అభ్యర్థి ఆరోపణలు
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక కౌంటింగ్ కొనసాగుతున్న విషయం తెలిసిందే.
By - Srikanth Gundamalla |
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉపఎన్నిక కౌంటింగ్పై బీఆర్ఎస్ అభ్యర్థి ఆరోపణలు
నల్లగొండ-వరంగల్-ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక కౌంటింగ్ కొనసాగుతున్న విషయం తెలిసిందే. సుదీర్ఘంగా ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. ఉప ఎన్నిక కౌంటింగ్లో కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న ముందంజలో ఉన్నారు. ఆధిక్యంలో కొనసాగుతున్నారు. అయితే.. కౌంటింగ్ పక్రియపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి రాకేశ్ రెడ్డి అనుమానాలు వ్యక్తం చేశారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఏకపక్షంగా సాగుతోందని ఆరోపణలు చేశారు. కౌంటింగ్ ఏజెంట్ల సంతకాలు లేకుండానే లీడ్ ప్రకటిస్తున్నారని రాకేశ్రెడ్డి తెలిపారు.
సందేహాలను నివృత్తి చేయకుండా ఆర్వోలు ఏకపక్షంగా వ్యవహరించారని రాకేశ్ రెడ్డి ఫైర్ అయ్యారు. అధికారులు ప్రజాస్వామ్యబద్దంగా వ్యవహరించలేదని అన్నారు. ఇదేంటని అడిగితే తమను పోలీసులు బయటకు నెట్టారని రాకేశ్రెడ్డి చెప్పారు. సమారు వెయ్యి ఓట్లు గోల్మాల్ అయ్యాయని రాకేశ్రెడ్డి ఆరోపించారు.
ఇక రాకేశ్రెడ్డి ఆరోపణలపై కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న స్పందించారు. ఆయన కామెంట్స్ను ఖండించారు. అధికారుల పనితీరుపై బీఆర్ఎస్ నాయకులు అసత్య ప్రచారం చేస్తున్నారని అన్నారు. ఇది ఏమాత్రం సరికాదన్నారు. ఓట్ల లెక్కింపు ఫలితాలు ముందుగా బీఆర్ఎస్ నాయకులకే తెలుస్తోందనీ.. రూ.కోట్లు ఖర్చుపెట్టి గెలవాలని కేటీఆర్ ప్రయత్నించారని మల్లన అన్నారు. ఓటమి భయంతోనే అధికారులపై ప్రస్తుతం ఆరోపణలు చేస్తున్నారని వ్యాఖ్యానించారు.
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు తొలి 3 రౌండ్లలో కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న 18,878 ఓట్ల ఆధిక్యత కనబరిచారు. ఆయనకు 1,06,234 ఓట్లు, బీఆర్ఎస్ అభ్యర్థి రాకేశ్రెడ్డికి 87,356 ఓట్లు, బీజేపీ అభ్యర్థి ప్రేమేందర్రెడ్డికి 34,516 ఓట్లు పోలయ్యాయి.