Medchal: బాచుపల్లిలో గోడ కూలిన దుర్ఘటనలో ఆరుగురు అరెస్ట్
బాచుపల్లిలో గత మంగళవారం భారీ వర్షం కారణంగా ఘోర ప్రమాదం సంభించిన విషయం తెలిసిందే.
By Srikanth Gundamalla
Medchal: బాచుపల్లిలో గోడ కూలిన దుర్ఘటనలో ఆరుగురు అరెస్ట్
మేడ్చల్ జిల్లాలోని బాచుపల్లిలో గత మంగళవారం భారీ వర్షం కారణంగా ఘోర ప్రమాదం సంభించిన విషయం తెలిసిందే. వర్షం కారణంగా నిర్మాణంలో ఉన్న భవనం ప్రహారిగోడ కుప్పకూలి.. పక్కనే ఉన్న షెడ్పై పడిపోయింది. ఈ సంఘటనలో ఏడుగురు భవన నిర్మాణ కార్మికులు దుర్మరణం చెందారు. దీనిపై విచారణ జరిపిన పోలీసులు తాజాగా చర్యలను ప్రారంభించారు. ఏడుగురు మృతి చెందిన కేసులో.. ఆరుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. భవన నిర్మాణదారుడు అరవింద్రెడ్డి, సైట్ ఇంజినీర్ సతీష్, ప్రాజెక్టు మేనేజర్ ఫ్రాన్సిస్, గుత్తేదారు రాజేశ్తో పాటుగా మరో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
కాగా.. బాచుపల్లిలో భవనం కూలిపోయి ఏడుగురు మృతిచెందిన సంఘటనకు ఆరుగురిని బాధ్యులుగా పోలీసులు తెలిపారు. ఆరుగురు వ్యక్తులను పోలీసులు గురువారమే కోర్టులో హాజరుపర్చనున్నారు. మరోవైపు ఈ ప్రమాదంలో మృతిచెందిన ఏడుగురి మృతదేహాలకు పోస్టుమార్టం చేయనున్నారు. ఆ తర్వాత డెడ్బాడీస్ను వారివారి బంధువులకు అప్పగించనున్నారు. కాగా.. మృతులు అంతా ఒడిశా, చత్తీస్గఢ్ రాష్ట్రాలకు చెందినవారు.
బాచుపల్లిలోని కౌసల్య కాలనీలో ఓ అపార్ట్మెంట్ను నిర్మించేందుకు పనులను కొనసాగిస్తున్నారు. అయితే.. మంగళవారం రాత్రి ఒక్కసారిగా కురిసిన వర్షాలతో అపార్ట్మెంట్ ప్రహారిగోడ ఒక్కసారిగా కూలి.. దానికి ఆనుకునే ఉన్న రేకుల షెడ్డుపై పడిపోయింది. అందులో ఉంటోన్న ఏడుగురు కూలీలు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఇక మరో నలుగురు తీవ్ర గాయాలతో బయటపడ్డారు. ప్రస్తుతం వారు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే.. ఈ ఐదంతస్తుల భవనాన్ని రైజ్ డెవలపర్స్ కన్స్ట్రక్షన్స్ సంస్థ నిర్మిస్తోందని పోలీసులు చెప్పారు. ఇక్కడ గతంలో ముందు 10 నుంచి 15 అడుగల ఎత్తు వరకు ప్రహారీ గోడను నిర్మించారు. తర్వాత దానినే 30-40 అడుగులకు పెంచారు... వర్షపు నీరు వల్ల పునాదులు బలహీనపడ్డాయనీ.. దాంతో. అది కూలిపోయిందని అధికారులు చెబుతున్నారు.