ప్రభుత్వ కార్యాలయాలకు లాక్డౌన్ ఎత్తివేత..!
By సుభాష్ Published on 11 May 2020 8:28 AM GMTకరోనా వైరస్ దేశ వ్యాప్తంగా విజృంభిస్తోంది. కరోనా కట్టడిలో భాగంగా అన్ని రాష్ట్రాల్లో మే 17వ తేదీ వరకూ లాక్డౌన్ కొనసాగనుంది. అయితే తెలంగాణ ప్రభుత్వం మాత్రం కాస్త ముందుకెళ్లింది. మే 29 వరకూ లాక్డౌన్ పొడిగిస్తూ సీఎం కేసీఆర్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇప్పటికే కొన్ని కేంద్రం లాక్డౌన్ నుంచి కొన్ని సడలింపులు ఇచ్చింది. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కూడా లాక్డౌన్ నుంచి కొన్ని సడలింపులు ఎత్తివేసే అవకాశం కనిపిస్తోంది. ప్రభుత్వ కార్యాలయాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సోమవారం నుంచి ప్రభుత్వ ఉద్యోగులు విధులకు హాజరు కానున్నట్లు తెలుస్తోంది.
గ్రీన్, ఆరెంజ్ జోన్ల పరిధిలో ఉన్న జిల్లాల్లోని ఉద్యోగులంతా విధులకు హాజరు కావాలని ఆదేశాలు కూడా జారీ చేశారు. ప్రభుత్వ ఉద్యోగులు, కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు అందరు విధుల్లో చేరనున్నారు.
ఇక కరోనా పాజిటివ్ కేసులు రాష్ట్రంలో తగ్గుముఖం పట్టాయి. ప్రతి రోజు నమోదవుతున్న పాజిటివ్ కేసులు కేవలం హైదరాబాద్ జీహెచ్ఎంసీ పరిధిలో మాత్రమే ఉంటున్నాయి. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో గత 14 రోజులకు పైగా ఒక్క కరోనా పాజిటివ్ కేసు కూడా నమోదు కావడం లేదు.
ప్రస్తుతం అన్ని జోన్లలో వైద్య, ఆరోగ్యం, పోలీస్, రెవెన్యూ, వ్యవసాయం, మున్సిపల్ శాఖల ఉద్యోగులు పని చేయనున్నారు. ఈనెల 15న సీఎం కేసీఆర్ మంత్రులు, అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశం తర్వాత లాక్డౌన్ నుంచి మరిన్ని సడలింపులు ఇచ్చే అవకాశం కనిపిస్తోంది.