గందరగోళం సృష్టిస్తే కఠిన చర్యలు తీసుకోండి!
By సుభాష్ Published on 7 March 2020 10:39 AM IST
- డీజీపీని ఆదేశించిన సీఎం కేసీఆర్
కరానో వైరస్.. ఇప్పుడు ఈ పేరుచెబితే వణికిపోని వారుండరు. ప్రపంచ దేశాలనే కాకుండా రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఇప్పుడు ఈ కరోనా వైరస్ ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తోంది. ఈ వైరస్ను కట్టడి చేసేందుకు రెండు ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నాయి. ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వం కరోనా వైరస్ బారిన ఎవరూ పడకుండా ప్రజల్లో అవగాహన కల్పిస్తుంది. వైరస్రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని, ఏ విధంగా ఉండాలని,ఎలాంటి పదార్థాలు తినాలి అనే వాటిపై ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తుంది. దీనికితోడు అన్ని ప్రభుత్వ ఆస్ప్రతుల్లో, ప్రధాన ప్రయివేట్ ఆస్పత్రుల్లో ఐసోలేషన్ వార్డులను ఏర్పాటు చేస్తుంది. కరానో వైరస్ సోకినట్లు అనుమానంగా ఉన్న వ్యక్తులను ఇటీవల ఐసోలేషన్ వార్డులో ఉంచి ప్రత్యేక చికిత్స నిర్వహించారు. రక్త పరీక్షలు నిర్వహించి వైరస్ లేదని వైద్యులు తేల్చారు.
కాగా శుక్రవారం ఖమ్మం జిల్లా వైరాకు చెందిన ఇద్దరికి కరోనా వైరస్ సోకిందని వార్తలు వచ్చాయి. దీంతో వారిని ఖమ్మం ప్రభుత్వాస్పత్రికి తరలించి, అక్కడి నుండి అబ్జర్వేషన్లో ఉంచేందుకు హైదరాబాద్ గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఇలా ప్రభుత్వం ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటూ కరానో వైరస్ రాష్ట్రంలో వ్యాప్తిచెందకుండా పకడ్బందీగా చర్యలు తీసుకుంటుంది. ఇదిలా ఉంటే కరానో వైరైస్పై పుకార్లు సికార్లు చేస్తున్నాయి. పలువురు సోషల్ మీడియాలో కరోనా వైరస్పై దుష్ప్రచారం చేస్తున్నారు. కరానో వైరస్ రాకుండా నాటు వైద్యం ఉందని ఒకరు, హమియో వైద్యం ఉందని ఒకరు, మాత్రలు వేసుకుంటే సరిపోతుందని మరికొరు ఇలా ప్రచారం చేస్తున్నారు. దీంతో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని పలువురు కరోనా వైరస్ రాకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలో గందరగోళానికి గురవుతున్నారు. నేపథ్యంలో కరోనాపై వైద్య ఆరోగ్యశాఖ ఏర్పాటు చేసిన 104 హెల్ప్లైన్కు 24 గంటల్లోనే 210 కాల్స్ వచ్చాయి. అందులో 185 మంది కరోనాకు సంబంధించిన సమాచారాన్ని అడిగి తెలుసుకున్నారు.
మరో 25 మంది తమకు కరోనా లక్షణాలున్నాయని 104 హెల్ప్లైన్కు తెలిపారు. అయితే ఆ లక్షణాలున్నాయని చెప్పిన వారిలో క్రాస్ చెక్ చేయగా కరోనా లక్షణాలు లేవని తేలింది. ఈ పరిస్థితుల్లో.. శుక్రవారం శాసనసభ లాబీలో పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు సీఎం కేసీఆర్ను కలిసి కరోనాపై అవగాహన లేకుండా మాట్లాడుతూ, నివారణ, వైద్యం గురించి చెబుతూ గందరగోళం సృష్టిస్తున్నారని తెలిపారు. దీనికి సీఎం స్పందించి వారిని గుర్తించి చర్యలు తీసుకోవాలని డీజీపీ మహేందర్రెడ్డిని ఆదేశించారు.