ధోని కూతురిపై కామెంట్లు చేసిన బాలుడి అరెస్ట్‌..!

By సుభాష్  Published on  12 Oct 2020 4:58 AM GMT
ధోని కూతురిపై కామెంట్లు చేసిన బాలుడి అరెస్ట్‌..!

భారత మాజీ క్రికెటర్‌, చెన్నై సూపర్‌ కింగ్స్‌ కెప్టెన్‌ ఎంఎస్‌ ధోని కుమారై జీవాపై అభ్యకర కామెంట్లు చేసిన 16 ఏళ్ల బాలుడిని పోలీసులు అరెస్టు చేశారు. అతడు గుజరాత్‌లోని కచ్‌ జిల్లా ముంద్రా ప్రాంతానికి చెందినవాడిగా రాంచీ పోలీసులు గుర్తించి అక్కడి పోలీసులకు సమాచారం ఇచ్చారు. అతడిని అదుపులోని తీసుకొని విచారించగా.. ఆ పోస్ట్‌ తానే చేసినట్లు ఒప్పుకున్నాడు. రాంచీ పోలీసులు ఇక్కడికి వచ్చిన అనంతరం నిందితుడిని వారికి అప్పగిస్తామని కచ్‌ జిల్లా (వెస్ట్‌) ఎస్పీ సౌరబ్‌ సింగ్‌ తెలిపారు.

కోల్‌కత్తా నైట్ రైడర్స్ తో చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్ తరువాత, తన ఇన్ స్టాగ్రామ్ లో ఈ పోస్ట్ ను స్వయంగా పెట్టినట్టు ఆ బాలుడు అంగీకరించాడని తెలిపిన సౌరబ్ సింగ్, అతనితో పాటు మరికొందరు కూడా జీవాపై ఇదే తరహా పోస్టులు పెట్టారన్నారు. అతన్ని రాంచీ పోలీసులకు అప్పగించనున్నామని.. ఆ నగరంలోనే అతనిపై ఎఫ్ఐఆర్ నమోదు కానుందని తెలిపారు. తదుపరి విచారణ నిమిత్తం బాలుడిని తీసుకెళ్లేందుకు రాంచీ పోలీసులు కచ్ కు రానున్నారని స్పష్టం చేశారు. జీవాపై వ్యాఖ్యలు వెల్లువెత్తడంతో.. పలువురు క్రికెటర్లు, రాజకీయ నాయకులు, సెలబ్రిటీలు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే.

Next Story