మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా ఎస్వీఆర్ విగ్రహావిష్కరణ
By న్యూస్మీటర్ తెలుగు Published on 5 Oct 2019 1:44 PM GMT
విశ్వ నటచక్రవర్తి కీ.శే. ఎస్వీ రంగారావు కాంస్య విగ్రహాన్ని.. పద్మభూషణుడు, మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా ఆవిష్కరించనున్నారు. 6 అక్టోబర్ 2019 (ఆదివారం) ఉదయం 10.15 నిమిషాలకు తాడేపల్లిగూడెం యస్.వి.ఆర్. సర్కిల్, కె.యన్.రోడ్ లో విగ్రహావిష్కరణకు ఏర్పాట్లు సాగుతున్నాయి. 'సైరా నరసింహారెడ్డి' ఘనవిజయం నేపథ్యంలో ప్రచారకార్యక్రమాల బిజీలోనూ మెగాస్టార్ ఇచ్చిన మాటకు కట్టుబడి విగ్రహావిష్కరణకు విచ్చేస్తున్నందుకు నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ సందర్భంగా ఎస్వీ రంగారావు సేవాసమితి ప్రతినిధులు మాట్లాడుతూ.. ''మెగాస్టార్ చిరంజీవి 'సైరా: నరసింహారెడ్డి' చిత్రంతో సంచలన విజయం అందుకున్న ఆనందంలో ఉన్నారు. స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డిగా మెగాస్టార్ అద్భుతంగా నటించారు. ఐదు భాషల్లో రిలీజైన సైరా విజయం తెలుగు వారి సక్సెస్ గా భావిస్తున్నాం. ఒక గొప్ప చారిత్రక విజయం అందుకున్న సందర్భంగా ఎస్వీఆర్ విగ్రహావిష్కరణకు ఆయన విచ్చేయడం ఎంతో సంతోషంగా ఉంది.
ఇచ్చిన మాట కోసం కమిట్మెంట్తో మెగాస్టార్ ఈ ఆవిష్కరణకు విచ్చేస్తున్నారు. ఓవైపు సైరా ప్రచారంలో బిజీగా ఉండీ ఆయన మాటకు కట్టుబడి విచ్చేయడం సంతోషాన్నిస్తోంది. ఆదివారం ఉదయం గన్నవరం నుంచి తాడేపల్లి చేరుకుని విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. అటు పై తిరిగి మెగాస్టార్ హైదరాబాద్ కి విచ్చేస్తారు అని తెలిపారు.