సూపర్‌ ఓవర్‌కు ముందు క్రిస్‌గేల్‌కు కోపమొచ్చింది

By సుభాష్  Published on  19 Oct 2020 7:51 AM GMT
సూపర్‌ ఓవర్‌కు ముందు క్రిస్‌గేల్‌కు కోపమొచ్చింది

ఆదివారం రాత్రి ముంబైఇండియన్స్‌, కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ మధ్య జరిగిన మ్యాచ్‌లో విజయం ఇరు జట్లతో దాగుడు మూతలు ఆడింది. గెలుపొందేందుకు ఇరు జట్లు నువ్వా నేనా అన్న రీతిలో పోరాడడంతో మ్యాచ్‌ టై అయ్యింది. సూపర్‌ ఓవర్‌ నిర్వహించగా.. అక్కడా స్కోర్లు సమం అయ్యాయి. దీంతో ఫలితాన్ని తేల్చేందుకు మరో సూపర్‌ ఓవర్‌ను నిర్వహించాల్సి వచ్చింది. ఆ సూపర్‌ ఓవర్‌లో క్రిస్‌గేల్‌, మయాంక్‌ అగర్వాల్‌ పంజాబ్‌ తరుపున బ్యాటింగ్‌కు దిగారు.

బ్యాటింగ్‌కు దిగే ముందే గేల్‌ కోపం, అసంతృప్తితో ఉన్నాడు. తొలి బంతికి సిక్స్‌ బాదిన ఈ యూనివర్స్‌ బాస్‌ రెండో బంతిని సింగిల్‌ తీశాడు. ఆ తరువాత మయాంక్‌ వరుసగా రెండు పోర్లు బాది జట్టుకు విజయాన్ని అందించాడు. కాగా.. ఆ సమయంలో గేల్‌ కోపంగా ఉండడానికి గల కారణాన్ని వెల్లడించాడు. " నేను సూపర్‌ ఓవర్‌లో బ్యాటింగ్‌కు వెళ్లే సమయంలో ఎలాంటి ఒత్తిడి లేదు. అయితే.. కొంచెం కోపం వచ్చింది. సులభంగా గెలవాల్సిన మా జట్టును ఆ పరిస్థితుల్లో చూసి ఆందోళన చెందాను. ఇది క్రికెట్‌.. ఎప్పుడు ఎమైనా జరగొచ్చు. తొలి సూపర్‌ ఓవర్‌లో రోహిత్‌, డికాక్‌లకు సమర్ధవంతంగా బౌలింగ్‌ చేసి ఆరు పరుగులను కాపాడాడు షమి. అతనే ఈ మ్యాచ్‌ హీరో అని గేల్‌ అన్నాడు.

టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 176 పరుగులు చేసింది. క్వింటన్ డికాక్(43 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్‌లతో 53)హాఫ్ సెంచరీకి తోడు చివర్లో కీరన్ పొలార్డ్(12 బంతుల్లో 1 ఫోర్, 4 సిక్స్‌లతో 34 నాటౌట్), కౌల్టర్ నీల్ (12 బంతుల్లో 4 ఫోర్లతో 24 నాటౌట్) మెరుపులు మెరిపించారు. పంజాబ్ బౌలర్లలో షమీ, అర్ష్‌దీప్ సింగ్ రెండేసి వికెట్లు తీయగా.. క్రిస్ జోర్డాన్, రవి బిష్ణోయ్ చెరొక వికెట్ పడగొట్టారు. అనంతరం కింగ్స్ పంజాబ్ నిర్ణీత ఓవర్లలో 176 పరుగులే చేసింది. కేఎల్ రాహుల్ (51 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్స్‌లతో 77) హాఫ్ సెంచరీతో రాణించాడు. తొలి సూపర్ ఓవర్‌లో పంజాబ్ 5 పరుగులు చేయగా.. ముంబై ఇండియన్స్ కూడా 5 పరుగులే చేసింది. సెకండ్ సూపర్ ఓవర్‌లో ముంబై 11 రన్స్ చేయగా.. గేల్, మయాంక్ సూపర్ బ్యాటింగ్‌తో 4 బంతుల్లోనే పంజాబ్ విజయాన్నందుకుంది.

Next Story