తండ్రి మరణం తట్టుకోలేక తనయుడు కూడా..
By Newsmeter.Network Published on 19 Jan 2020 7:15 AM GMTఆ అబ్బాయికి తండ్రి అంటే ప్రాణం.. ఆ తండ్రికి కొడుకంటే ప్రేమ. ఇద్దరూ ఒకరిని విడిచి మరొకరు ఉన్నది లేదు. అయితే విధి ఆడిన నాటకంలో ఆ తండ్రి మరణించగా.. తండ్రి లేని లోకం నాకెందుకని ఆ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ హృదయ విదాకరమైన ఘటన పలువురిని కంట తడి పెట్టించింది.
నిర్మల్ జిల్లా మామడ మండలంలోని దిమ్మదుర్తి గ్రామానికి చెందిన చింతల నాగరాజు, లక్ష్మి దంపతులకు కుమారుడు నవీన్ (20), కూతురు ఉన్నారు. ఇటీవల తండ్రి చింతల నాగరాజు కు క్యాన్సర్ సోకింది. ఆర్థిక ఇబ్బందులతో మెరుగైన వైద్యం కోసం వెళ్లలేని పరిస్థితి. శనివారం జిల్లా కేంద్రంలోని ఆస్పత్రిలో పరిస్థితి విషమించి మృతి చెందాడు. మృతదేహాన్ని ఆస్పత్రి నుంచి స్వగ్రామానికి అంబులెన్స్లో తీసుకురాగా కుమారుడు నవీన్ ద్విచక్రవాహనంపై బయలుదేరాడు. తండ్రి మరణాన్ని జీర్ణించుకోలేని నవీన్ మార్గంమధ్యలో పురుగుల మందు తాగాడు.
ఇక తండ్రి అంత్యక్రియలకు ఎంతసేపైనా నవీన్ రాకపోవడంతో అనుమానం వచ్చిన కుటుంబ సభ్యులు వెతకం మొదలు పెట్టారు. కొండాపూర్ సమీపంలో పురుగుల మందు తాగి అపస్మారక స్థితిలో కనిపించాడు. వెంటనే అతన్ని ఆస్పత్రికి తరలించారు. అతన్ని పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతిచెందినట్లు తెలిపారు.ఒకే రోజు తండ్రీ కొడుకులు మరణించడంతో ఆ గ్రామంలో విషాదం నెలకొనింది.