షాద్నగర్ వెటర్నరీ డాక్టర్ హత్యపై పలు అనుమానాలు
By Newsmeter.Network Published on 29 Nov 2019 4:53 AM GMTముఖ్యాంశాలు
- షాద్నగర్ వెటర్నరీ డాక్టర్ హత్య
- రంగారెడ్డి జిల్లా తొండుపల్లి టోల్ప్లాజా వద్ద కిడ్నాప్
- చటాన్పల్లి వద్ద కాలిపోయిన స్థితిలోమృతదేహం
- అత్యాచారం చేసి, ఆపై హత్య చేసి ఉంటారని అనుమానం
- డాక్టర్ చివరి ఫోన్ కాల్
రంగారెడ్డి జిల్లా: షాద్నగర్ సమీపంలో వెటర్నరీ డాక్టర్ హత్య కలకలం రేపింది. షాద్నగర్ శివారులోని చటాన్పల్లి వద్ద మంటలను చూసిన రైతులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని గుర్తించి, కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు.
అయితే నాగర్కర్నూల్ జిల్లా కోడేరు మండలం నర్సాయిపల్లికి చెందిన యువతిగా పోలీసులు తెలిపారు. నవాబ్పేట మండలం కొల్లూరులోని ప్రభుత్వ పశు వైద్యశాలలో వైద్యురాలిగా పనిచేస్తోంది. ఆమె చెల్లి శంషాబాద్ ఎయిర్ పోర్టులో ఉద్యోగి.
స్కూటీ పంక్చర్ కోసం..
అయితే డాక్టర్ స్కూటీ పంక్చర్ అయ్యింది. బాగుచేసుకొస్తానని ఓ 20 ఏళ్ల గుర్తు తెలియని యువకుడు ఆమె స్కూటీ తీసుకెళ్లాడు. కొద్దిసేపటి తర్వాత వచ్చి.. పంక్చర్ అతికించేవారు లేరని, మరో చోటుకు తీసుకెళ్తానని ఆమెకు చెప్పాడు. అందుకు ఆమె మొదట ఒప్పుకోలేదు. తానే వెళ్లి ఎక్కడైనా పంక్చర్ అతికించుకుంటానని చెప్పింది. అయిన ఆ వ్యక్తి వినకుండా మధ్యలోనే స్కూటీ ఆగిపోతుందని చెప్పి పంక్చర్ అతికించేందుకు మరో చోటుకు తీసుకెళ్లాడు.
వెటర్నర్ డాక్టర్ చివరి ఫోన్ కాల్..
'నా స్కూటీ పంక్చర్ అయ్యింది.. అతికించుకోస్తానని ఓ వ్యక్తి నా స్కూటీ తీసుకెళ్లాడు. పక్కన లారీలో ఎవరో చాలా మంది ఉన్నారు. నాకు చాలా భయమేస్తుంది.' అంటూ ఆమె తన చెల్లెలికి ఫోన్ చేసి చెప్పింది. చుట్టూ లారీ డ్రైవర్లు ఉన్నారని, వారిని చూస్తే భయమేస్తోందని, అంతా తననే చూస్తున్నారంటూ ఆమె చెప్పింది. ఒంటరిగా ఉన్నానని, కొద్దిసేపు మాట్లాడాలంటూ సోదరిని కోరింది.
ఇలా సుమారు 6 నిమిషాల పాటు ఆమె తన చెల్లెలితో ఫోన్లో సంభాషించింది. ఆ తర్వాత ఆమె ఫోన్ స్విచ్ఛాఫ్ అయ్యింది. ఫోన్ స్విచ్ఛాఫ్ అయిన తర్వాత ఆమె ఇంటికి రాలేదు. దీంతో కుటుంబ సభ్యులు శంషాబాద్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు అదృశ్యం కేసు నమోదు చేశారు. ఈనేపథ్యంలోనే షాద్నగర్లో మహిళ హ్య జరిగిన సంఘటన వెలుగుచూసింది. దీంతో పోలీసులు అక్కడకు చేరుకున్నారు. కానీ.. ఘటనాస్థలంలో పూర్తిగా కాలిపోయి గుర్తుపట్టని స్థితిలో ఉన్న ఆమె మెడలో ఉన్న బంగారు లాకెట్ ఆధారంగా పోలీసులు ఆమెను గుర్తించారు.
డాక్టర్ హత్యపై పలు అనుమానాలు..
అయితే డాక్టర్ సెల్ఫోన్ స్విచ్చాఫ్ అయ్యింది. ఆ తర్వాతే ఆమెను దుండగులు కిడ్నాప్ చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు. కాగా.. ఆమె కిడ్నాప్ అయిన ప్రాంతానికి , ఆమె మృతదేహానికి మధ్య దాదాపు 30 కిలోమీటర్ల దూరం ఉంటుంది. వేరే ప్రాంతంలో హత్య చేసి చటాన్పల్లి వద్దకు తీసుకొచ్చారా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
తొండుపల్లి టోల్ప్లాజా వద్ద ఉన్న లారీ డ్రైవర్లు ఆమెను అత్యాచారం చేసేందుకు ప్రయత్నించారా..? ఆమె ఎదురుతిరగడంతోనే హత్య చేసి ఆపై నిప్పంటించారా..?. అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఆ దుండగులు ఆమె దాదాపు ఏడు గంటల పాటు తమ వద్ద ఉంచుకున్నట్లు సమాచారం. ఆ తర్వాతనే ఆమెపై ఈ దారుణానికి ఒడిగట్టినట్లు తెలుస్తోంది. అయితే ఆమె బుధవారం కిడ్నాప్కు గురైంది. కానీ.. ఆమెను దుండగులు గురువారం తెల్లవారుజాము వరకు ఎక్కడికి తీసుకెళ్లి ఉంటారన్నది తెలియాల్సి ఉంది. కాగా, ఆమె మృతదేహానికి వైద్యులు ఘటనా స్థలంలోనే పోస్టుమార్టం నిర్వహించారు.