స్కూల్స్‌, కాలేజీలకు 9-12 తరగతి విద్యార్థులు.. మార్గదర్శకాలు విడుదల చేసిన కేంద్రం

By సుభాష్  Published on  9 Sep 2020 3:38 AM GMT
స్కూల్స్‌, కాలేజీలకు 9-12 తరగతి విద్యార్థులు.. మార్గదర్శకాలు విడుదల చేసిన కేంద్రం

దేశంలో అన్‌లాక్‌ 4.0 మార్గదర్శకాల్లో భాగంగా 9-12వ తరగతి విద్యార్థులు పాఠశాలలు, కళాశాలలకు వెళ్లేందుకు కేంద్రం అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. దీనికి సంబంధించి కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ మార్గదర్శకాలను విడుదల చేసింది. విడుదలైన మార్గదర్శకాల ప్రకారం.. ఉపాధ్యాయులు, విద్యార్థులు పాటించాల్సిన నియమాలను పొందుపర్చింది. 9 నుంచి 12 తరగతుల విద్యార్థులు పాఠశాలలు, కళాశాలలకు వెళ్లవచ్చని, లేదా ఆన్‌లైన్‌ క్లాసుల ద్వారా పాఠాలు వినాలని సూచించింది. ఆప్షన్‌ను విద్యార్థుల నిర్ణయానికే వదిలిపెట్టింది. పాఠశాలలు, కళాశాలలకు వెళ్లడం స్వచ్చంధ నిర్ణయమని పేర్కొంది. అందుకు తల్లిదండ్రులు, సంరక్షకుల నుంచి లిఖిత పూర్వకంగా ఆమోదం తప్పనిసరి.

కంటైన్‌మెంట్‌ జోన్‌ వెలుపల ఉన్న స్కూళ్లకు మాత్రమే..

కాగా, కేవలం కంటైన్‌మెంట్‌ జోన్‌ వెలుపల ఉన్న స్కూళ్లకు మాత్రమే తెరుచుకునేందుకు అనుమతి ఉంటుందని కేంద్రం తెలిపింది. కంటైన్‌మెంట్‌ జోన్‌ పరిధిలోని విద్యార్థులను పాఠశాలకు అనుమతించరు. విద్యార్థులు, ఉపాధ్యాయులు కంటైన్‌మెంట్‌ జోన్లను ఎట్టి పరిస్థితుల్లో సందర్శించరాదు. పాఠశాలలు రీఓపెన్‌కు ముందు లేబరోటరీస్‌తో సహా క్లాస్‌ రూమ్‌లన్నింటినీ 1శాతం సోడియం హైపోక్లోరైడ్‌ సోల్యూన్‌తో శానిటైజ్‌ చేయాలి. క్వారంటైన్‌ కేంద్రాలుగా ఉపయోగించబడ్డ పాఠశాలల్లో డీప్‌ క్లీనింగ్‌, శానిటైజేషన్‌ చేయాలి. టీచింగ్‌-నాన్‌ టీచింగ్‌ స్టాఫ్‌ కలిపి 50 శాతం సిబ్బందితోనే పాఠశాలలు నిర్వహించాలి.

బయోమెట్రిక్‌కు ప్రత్యామ్నాయం

► విద్యాసంస్థల యాజమాన్యం బయోమెట్రిక్‌ అటెండెన్స్‌కు ప్రత్యామ్నయ ఏర్పాట్లు చేయాలి

► విద్యార్థులు, ఉపాధ్యాయులు తప్పనిసరిగా 6 అడుగుల భౌతిక దూరం పాటించాలి

► పాఠశాలలోనే హ్యాండ్‌ వాష్‌ సదుపాయం కల్పించాలి

► క్యూ పద్దతి పాటించేటప్పుడు స్టాఫ్‌ రూమ్స్‌, లైబ్రరీలోనూ భౌతిక దూరం పాటించాలి

► ఒక వేళ బహిరంగ ప్రదేశాల్లో యాక్టివిటీ నిర్వహించాలంటే కరోనా ప్రోటోకాల్‌ తప్పనిసరి

ఎటువంటి కరోనా లక్షణాలు లేనివారికి మాత్రమే స్కూల్‌ ఆవరణలోకి అనుమతిస్తారు. ఎవరైనా టీచర్‌, విద్యార్థిలో కరోనా లక్షణాలు కనిపిస్తే తక్షణం సమీపంలోని హెల్త్‌ కేర్‌ సెంటర్‌కు వెళ్లాలి. పాఠశాల గోడలపై కరోనా పట్ల అవగాహన కల్పించే పోస్టర్లను సైతం అతికించాలి. ఎట్టి పరిస్థితుల్లో సందర్శకులను పాఠశాలల్లోకి అనుమతించరావు. అలాగే యాజమాన్యం విద్యార్థులకు ట్రాన్స్‌ ఫోర్ట్‌ సౌకర్యం కల్పిస్తే దాని శానిటైజేషన్‌ బాధ్యత కూడా యాజమాన్యానిదే. 1శాతం సోడియం హైపోక్లోరైట్తో వాహనాలను శానిటైజ్‌ చేయాలి. పాఠశాలల్లోని గదులను ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచాలి. విద్యార్థులు గానీ ఉపాధ్యాయులు గానీ ఎవరైన అనారోగ్యానికి గురైతే వెంటనే సమీపంలో ఉన్న హెల్త్‌ సెంటర్‌ను సంప్రదించాలి.



Next Story