ఇసుక రెడీగా ఉంది..కంగారు పడొద్దు!- మంత్రి పెద్దిరెడ్డి
By న్యూస్మీటర్ తెలుగు Published on 23 Sep 2019 3:27 PM GMT-రాష్ట్ర వ్యాప్తంగా 41 లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుక సిద్దం
-వరదలు తగ్గగానే ఎపిఎండిసి ద్వారా సరఫరా
-ఇప్పటి వరకు లక్ష క్యూబిక్ మీటర్ల సరఫరా
-పట్టాదారు భూముల నుంచి కూడా ఇసుక తవ్వకాలకు అనుమతి
-పశ్చిమ గోదావరి జిల్లాలో పడవల ద్వారా ఇసుక రవాాణా
-ఇసుక కొరత లేకుండా అన్ని చర్యలు
అమరావతి. రాష్ట్రవ్యాప్తంగా 41,37,675 క్యూబిక్ మీటర్ల ఇసుక నిల్వలు సిద్ధంగా ఉన్నాయన్నారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. కొత్త ఇసుక విధానం అమల్లోకి వచ్చినప్పటి నుంచి ఈ రోజు వరకు లక్ష క్యూబిక్ మీటర్ల ఇసుక సరఫరా చేశామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 13 జిల్లాల్లో 102 ఇసుక రీచ్ లను, 51 స్టాక్ యార్డ్ లను సిద్ధం చేశామన్నారు.మొత్తం 41 లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుక సప్లై కోసం టెండర్లు కూడా పిలిచామన్నారు.
గోదావరి, కృష్ణానదిలో వరదలు కారణంగా ఇసుక రవాణా కొంత ఇబ్బందికరంగా మారిందన్నారు పెద్దిరెడ్డి. వరదలు తగ్గుముఖం పట్టగానే పూర్తిస్థాయిలో ఏపీఎండీసీ ద్వారా ఇసుక రవాణా కొనసాగుతుందని తెలిపారు.
ప్రస్తుతం రాష్ట్రంలో 40 స్టాక్ యార్డ్ లు పనిచేస్తున్నాయని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వెల్లడించారు. 20 వేయింగ్ మిషన్లు ఇందుకోసం ఏర్పాటు చేశామన్నారు. పట్టాదారు భూమి నుంచి కూడా ఇసుక సరఫరా కొరకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ప్రధానంగా అనంతపురం జిల్లా రైతులు సుముఖత వ్యక్దం చేశారన్నారు.
ప్రకాశం జిల్లా జరుగుమల్లి మండలం పాలేరు వాగులో దాదాపు 263 ఎకరాలలో ఇసుక టెండర్ల ప్రక్రియ చివరి దశకు వచ్చిందన్నారు. అలాగే నెల్లూరు జిల్లాలో 12 రీచ్ ల నుంచి నాలుగు లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుకను, రోజుకు పది వేల క్యూబిక్ మీటర్ల మేర సరఫరా చేసేందుకు చర్యలు తీసుకున్నట్లు తెలిపారు.
గుంటూరు, కృష్ణా, కర్నూలు, చిత్తూరు జిల్లాల్లో కొత్త రీచ్ లను గుర్తించమన్నారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. పశ్చిమగోదావరి జిల్లాలో పడవల ద్వారా ఇసుకను తెచ్చేందుకు అసుమతిచ్చామన్నారు.
జిల్లాలు వారిగా ఇసుక - క్యూబిక్ మీటర్లలో
శ్రీకాకుళం జిల్లా- 5,09,360
తూర్పు గోదావరి - 6,33,358
పశ్చిమ గోదావరి - 2,22,230
కృష్ణా - 7,11,800
గుంటూరు - 5,50,254
నెల్లూరు - 4,21,145
కడప - 5,05,928
కర్నూలు - 1,97,600
అనంతపురం -2,50,500
చిత్తూరు - 1,35,500
మొత్తం: 41,37,675 క్యూబిక్ మీటర్లు