సైరా స్టోరీ ఎప్పుడు స్టార్ట్ చేసారు.? చిరు కాకుండా సైరా చేయాలనుకున్న హీరో ఎవరు..?
By న్యూస్మీటర్ తెలుగు Published on 30 Sep 2019 9:36 AM GMTమెగాస్టార్ చిరంజీవి నటించిన 'సైరా నరసింహారెడ్డి' గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఇటీవల హైదరాబాద్ లో భారీ స్ధాయిలో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ కి సైరా కథా రచయితల్లో ఒకరైన పరుచూరి గోపాలకృష్ణ హాజరు కాలేదు. ఆయన సైరా వేడుకకు రాకపోవడానికి గల కారణంతో పాటు పలు ఆసక్తికరమైన విషయాలను సోషల్ మీడియా ద్వారా తెలియచేసారు.
సైరా గురించి చెప్పిన ఆసక్తికరమైన విషయాలు పరుచూరి గోపాలకృష్ణ మాటల్లోనే... ఈ నెల 20వ తారీఖు నుంచి హెల్త్ ప్రాబ్లమ్ వుంది. 21,22, 23 తారీఖుల్లో అయితే... అడుగు తీసి అడుగు వేయలేని పరిస్థితిలో ఉన్నాను. అలాంటి పరిస్థితుల్లో నాకు చిరంజీవి గారు ఫోన్ చేసి మీరు ఈ విధంగా ఉన్నారా..? అయ్యోయ్యో ఈ రోజు మన సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ అంటే.. నేను సారీ సార్.. నా మనసు అంతా అక్కడే ఉంటుంది అన్నాను... మీరు సభ మిస్ అవ్వడం కాదు. మన వాళ్లందరూ మిమ్మల్ని మిస్ అవుతున్నారు అని అనడం చాలా ఆనందం కలిగింది.
చిరంజీవి గారి క్యారెక్టర్ విశిష్టమైంది. 2006లో సైరా కథని చిరంజీవి గారికి చెప్పడం జరిగింది. 2008 వరకు మా అన్నయ్య వెంకటేశ్వరరావు కథ మీద కూర్చొంటూనే ఉన్నారు. చిరంజీవి గారు ఒకటే అనేవారు కథ అద్భతంగా ఉంది. ఇంత బడ్జెట్ ని తెలుగు సినిమా భరించగలదా..? అంటుండేవారు. అప్పుడు ఆయన సడెన్ గా రాజకీయాల్లోకి వెళ్లిపోయారు.
మాకు చాలా బాధేసింది. అప్పుడు సైరా నరసింహారెడ్డి కథ ఇవ్వమని చాలా మంది వచ్చారు కానీ... మేము చిరంజీవి గారికి మాట ఇచ్చాము. ఎప్పటికైనా చిరంజీవి గారితో చేయాలి అని చెప్పేవాళ్లం. ఓసారి పవన్ కళ్యాణ్ కూడా.. అన్నయ్య సైరా కథను ఎంతగానో ప్రేమిస్తున్నారు. ఒకసారి నాకు చెప్పండి అని ఆయన అడిగారు. ఒకసారి చిరంజీవి గారు ఏమన్నారంటే... మళ్లీ సినిమాల్లోకి రాకపోతే.. రామ్ చరణ్ చేయవచ్చా..? ఒకసారి ఆలోచించండి అన్నారు. మేము మాత్రం మీరే చేయాలి. ఎప్పటికైనా సరే... మీరే చేయాలి అని చెప్పాం. అది ఇప్పటికీ నెరవేరింది అని పరుచూరి గోపాలకృష్ణ తెలియచేసారు.