తిరిగి వెళ్తున్నా.. కానీ.. భవిష్యత్తులో శబరిమల దర్శనం చేసి తీరుతా..!
By Newsmeter.Network Published on 27 Nov 2019 7:40 AM GMTభద్రతా కారణాలతో మహిళా సంఘం నాయకురాలు తృప్తి దేశాయ్ శబరిమల చేరకుండా వెనుదిరిగారు. ఆమెతో పాటు వచ్చిన మరో ఏడుగురు మహిళలకు.. శబరిమల ఆలయం వరకు రక్షణ కల్పించలేమని పోలీసులు తేల్చి చెప్పారు. దీంతో తృప్తి దేశాయ్ ఈ నిర్ణయం తీసుకున్నారు.
అయితే తృప్తి దేశాయ్ శబరిమల ఆలయంలోకి వెళ్లితీరతామని.. ఎర్నాకుళం సీటీ పోలీస్ కమిషనర్ కార్యాలయానికి వెళ్లిన సంగతి తెలిసిందే. కానీ.. ఆమెకు భద్రత కల్పించలేమని అధికారులు చెప్పడంతో పునెకు తిరిగి వెళ్లాలని నిశ్చయించుకున్నారు. ఈ లోగా కమిషనర్ కార్యాలయం వద్ద 'శమరిమల కర్మ సమితి' సభ్యులు చేరుకొని తృప్తి, ఆమె బృందానికి వ్యతిరేకంగా ఆందోళన చేపట్టారు.
ఈ సందర్భంగా తృప్తి దేశాయ్ మాట్లాడుతూ..
'శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశంపై ధర్మాసనం స్టే ఇవ్వలేదన్నారు. కాబట్టే ఆలయంలోకి వెళ్లేందుకు రక్షణ కల్పించమని కమిషనర్ కార్యాలయాన్ని సంప్రదించాము. కానీ, వచ్చినప్పటి నుంచి ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్నామని తెలిపారు. ఇది సరికాదు' అని చెప్పారు. తను, మిగిలిన మహిళలు పోలీసుల భద్రత మధ్య కార్యాలయంలో ఉండటం కూడా సురక్షితం కాదని అధికారులు చెప్పడంతో తిరిగి వెళ్లక తప్పలేదని తృప్తి వెల్లడించారు. కానీ.. తాను భవిష్యత్తులో కూడా ఇక్కడకు వస్తూనే ఉంటానని తృప్తి దేశాయ్ స్పష్టం చేశారు.