పూలు చల్లుతూ స్వాగతించినందుకు రాజకీయ దుమారం.. వివరణ ఇచ్చిన రోజా
By సుభాష్ Published on 21 April 2020 9:02 PM ISTఏప్రిల్ 19, ఆదివారం రోజున నగరి ఎమ్మెల్యే రోజాపై పూలు చల్లుతూ ఓ గ్రామస్తులు స్వాగతం పలికిన విషయంపై పెద్ద రాజకీయ దుమారం రేపుతోంది. లాక్డౌన్ నేపథ్యంలో సోషల్ డిస్టెన్స్ పాటించాలని ఒక వైపు ప్రభుత్వాలు చెబుతుంటే .. రోజాపై పూలు చల్లుతూ స్వాగతించడంపై మంగళవారం రాద్దాంతం చెలరేగింది. అంతేకాదు ఈ వ్యవహారంపై కూడా సోషల్ మీడియాలో విమర్శలు చెలరేగిన విషయం తెలిసిందే.
రోజా వ్యక్తిత్వ పూజకు అధిక ప్రాధాన్యత ఇచ్చారని, సోషల్ డిస్టెన్స్, కరోనా హెచ్చరికలను సైతం పట్టించుకోలేదని టీడీపీ నేతలు రోజాపై విమర్శల వర్షం కురిపించారు. అయితే ప్రజలు పూలు ఎందుకు చల్లారో వివరణ ఇచ్చుకున్నారు రోజా.
పుత్తూరు ప్రజలు గత ఐదేళ్లుగా మంచినీళ్లు లేక ఇబ్బందులు పడుతుంటే నేను నీటి సౌకర్యం కల్పించాను. నీటి వసతి కల్పించానన్న ఆనందంతో ప్రజలు నాపై పూలు చల్లారు. అక్కడ మహిళలు కూడా గ్లౌజులు ధరించి, సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ నాపై పూలు చల్లారు. చంద్రబాబు హయాంలో పుత్తూరులో నీళ్లు ఇవ్వలేకపోయారు. వారి బాధలను గుర్తించి నీళ్ల ఇచ్చాను. అందుకే నాకు పూలతో స్వాగతించారు.. అని చెప్పుకొచ్చారు రోజా. నాపై పూలు చల్లినందుకు అనవసరంగా బురదజల్లుతున్నారని విమర్శించారు. తాగునీరు ఇచ్చినందుకు వారు చూపిన అభిమానాన్ని రాజకీయం చేయవద్దని అన్నారు.