హైకోర్టును ఆశ్రయించిన రేవంత్‌.. ఏఐసీసీ నుంచి లాయర్ల బృందం!

By Newsmeter.Network  Published on  13 March 2020 7:42 AM GMT
హైకోర్టును ఆశ్రయించిన రేవంత్‌.. ఏఐసీసీ నుంచి లాయర్ల బృందం!

కాంగ్రెస్‌ ఎంపీ రేవంత్‌ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. డ్రోన్‌ కెమెరా కేసులో బెయిల్‌ కోసం కోర్టులో మూడు పిటిషన్లు దాఖలు చేశారు. నార్సింగ్‌ పీఎస్‌లో నమోదైన కేసు కొట్టివేయాలని విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా మియాపూర్‌ కోర్టు విధించిన రిమాండ్‌ను రద్దు చేయాలని అభ్యర్థించారు. పార్లమెంట్‌ సమావేశాలకు హాజరు కావాల్సిఉన్నందున బెయిల్‌ మంజూరు చేయాలని మరో పిటీషన్‌ దాఖలు చేశారు.

కాగా రేవంత్‌ కేసును సుప్రీంకోర్టు న్యాయవాది సల్మాన్‌ ఖుర్షీద్‌ వాదించనున్నారు. కేసు వాదన కోసం ఏఐసీసీ నుంచి సల్మాన్‌ ఖుర్షీద్‌ ఆధ్వర్యంలో లాయర్ల బృందం హైదరాబాద్‌ చేరుకుంది. ఈ బృందం రేవంత్‌ కేసులను వాదించనుంది. ఇదిలాఉంటే అంతకు ముందు బెయిల్‌ కోసం రేవంత్‌ మియాపూర్‌ కోర్టులో బెయిల్‌ పిటీషన్‌ దాఖలు చేసినా కోర్టు కొట్టి వేసింది. తాజాగా రేవంత్‌ హైకోర్టులో మూడు పిటీషన్లు దాఖలు చేశారు.

కేటీఆర్‌ ఫాంహౌస్‌పై నిబంధనలకు విరుద్ధంగా డ్రోన్‌ కెమెరాలను వినియోగించారనే ఆరోపణలపై రేవంత్‌ రెడ్డి, ఆయన సోదరుడు కొండల్‌ రెడ్డి సహా మొత్తం 8మందిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. ఈ కేసులో ఏ1, ఏ2గా ఉన్న రేవంత్‌ రెడ్డి, కృష్ణారెడ్డి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. మరొవైపు రేవంత్‌ రెడ్డి సోదరుడు కృష్ణారెడ్డి ఇప్పటికే హైకోర్టు ఆశ్రయించారు. నార్సింగి పోలీస్‌ స్టేషన్‌లో తమపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌ కొట్టి వేయాలని కోరుతూ క్యాష్‌ పిటీషన్‌ దాఖలు చేశారు.

Next Story