ఆర్‌సీబీ కొత్త పాట విన్నారా..?

By తోట‌ వంశీ కుమార్‌  Published on  18 Sep 2020 12:27 PM GMT
ఆర్‌సీబీ కొత్త పాట విన్నారా..?

క్రికెట్‌ ప్రేమికులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఇండియన్ ప్రీమియర్‌(ఐపీఎల్) శనివారం నుంచి ప్రారంభం కానుంది. 13వ సీజన్‌లో విజయం సాధించేందుకు ఇప్పటికే అన్ని జట్లు ప్రణాళికలు సిద్దం చేసుకున్నాయి. కరోనా మహమ్మారి కారణంగా ఈ ఏడాది ఐపీఎల్ యూఏఈ వేదికగా జరగుతోంది. ప్రేక్షకులను స్టేడియాలకు అనుమతించడం లేదు. ఇదిలా ఉంటే.. ఇప్పటి వరకు టైటిల్‌ సాధించిన జట్టు రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు. మొదటి సీజన్‌ నుంచి ప్రతి సీజన్‌లో కప్‌ మనదే అంటే రావడం.. చివరికి నిరాశకి గురి చేయడం అలవాటుగా మారింది. ఆ జట్టులో పరుగుల యంత్రం విరాట్‌ కోహ్లీతో పాటు మిస్టర్‌ 360 డిగ్రీస్‌ డివిలియర్స్‌ ఉన్నారు.

వీరిద్దరిలో ఒక్కరు రాణించినా.. ఎలా ఉంటుందో అందరికి తెలిసిందే. ఒక్క సారి కప్పు కొట్టకున్నా కూడా ఆ జట్టు ఫ్యాన్‌ ఫాలోయింగ్‌కు ఏ మాత్రం డోకా లేదు. ఈ సారి ఎలాగైనా విజయం సాధించాలని పట్టుదలతో ఉంది ఆర్‌సీబీ. కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ నేతృత్వంలో ఆటగాళ్లంతా తీవ్రంగా శ్రమిస్తున్నారు. తొలి మ్యాచ్‌లో విజయం సాధించి టోర్నీలో ఘనంగా బోణి చేయాలని పట్టుదలగా ఉంది. ఇప్పటికే ఆ జట్టు కొత్త జెర్సీని ఆవిష్కరించిన సంగతి తెలిసిందే.

ఇక ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారితో పోరులో ముందు వరుసలో ఉన్న వైద్యులు, పోలీసులు, పారిశుధ్ధ్య కార్మికులకు ఆర్‌సీబీ నివాళులు అర్పిస్తోంది. జట్టు జెర్సీ ముందు వెనుకా.. 'మై కొవిడ్‌ హీరోస్‌' అని రాయించింది. వీటిని ధరించే ఆటగాళ్లు బరిలోకి దిగనున్నారు. శుక్రవారం ఆర్‌సీబీ నేపథ్య గీతాన్ని ఆవిష్కరించింది. ఈ పాట అద్భుతంగా ఉంది. అభిమానుల ఆశలకు తగ్గట్టుగా పాటను రూపొందించారు. ఆర్‌సీబీ తన తొలి మ్యాచ్‌ను సెప్టెంబర్‌ 21న సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో తలపడనుంది.



Next Story