ర‌విబాబు 'ఆవిరి' సినిమా పై మ‌హేష్ బాబు ట్వీట్.. దీని వెన‌క ఏం జ‌రిగింది..?

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  1 Oct 2019 1:10 PM GMT
ర‌విబాబు ఆవిరి సినిమా పై మ‌హేష్ బాబు ట్వీట్.. దీని వెన‌క ఏం జ‌రిగింది..?

'అల్ల‌రి' సినిమాతో ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మై.. తొలి ప్ర‌య‌త్నంలోనే విజ‌యం సాధించి.. త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక గుర్తింపు ఏర్ప‌రుచుకున్నాడు యాక్ట‌ర్ ట‌ర్న‌డ్ డైరెక్ట‌ర్ ర‌విబాబు. ఆ త‌ర్వాత అమ్మాయిలు అబ్బాయిలు, సోగ్గాడు, అన‌సూయ‌, న‌చ్చావులే, అవును... త‌దిత‌ర చిత్రాల‌తో విజ‌యాలు సాధించాడు. అయితే... ఇటీవ‌ల కాలంలో తెర‌కెక్కించిన ల‌డ్డుబాబు, అవును- 2, అదుగో చిత్రాల‌తో ఆక‌ట్టుకోలేక‌పోయాడు.

దీంతో ఈసారి ఎలాగైనా స‌రే.. విజ‌యం సాధించాల‌నే ప‌ట్టుద‌ల‌తో 'ఆవిరి' అనే స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ ని తెర‌కెక్కించాడు. ఈ చిత్రంలో రవిబాబుతో పాటు నేహా చౌహాన్, హిమజ, ముక్తార్ ఖాన్ తదితరులు నటించారు. దిల్ రాజు సమర్పణలో వస్తున్న 'ఆవిరి' చిత్రం టీజర్ విడుదలైంది. దీని పై అగ్రహీరో మహేశ్ బాబు స్పందించారు. హారర్ కథాంశంతో చిత్రాలు తీయడంలో రవిబాబుది అందెవేసిన చేయి అని కితాబిచ్చారు.

ఇలాంటి జానర్ లో వచ్చిన సినిమాలు ఎంతో ఆసక్తికరంగా ఉంటాయని తెలిపారు. చిత్ర బృందానికి శుభాకాంక్షలు అంటూ సోషల్ మీడియాలో విషెస్ తెలిపారు. ఫ్లయింగ్ ఫ్రాగ్స్ పతాకం పై రవిబాబు స్వీయనిర్మాణంలో తెరకెక్కించిన ఆవిరి చిత్రం అక్టోబరులో ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే... మ‌హేష్ బాబు ట్వీట్ చేయ‌డానికి కార‌ణం ఏంటంటే... ఈ మూవీని దిల్ రాజు రిలీజ్ చేస్తున్నారు. దిల్ రాజు ప్ర‌స్తుతం మ‌హేష్ తో స‌రిలేరు నీకెవ్వ‌రు సినిమాని నిర్మిస్తున్నారు. అందుచేత దిల్ రాజు కోరిక మేర‌కు మ‌హేష్ ట్వీట్ చేసాడ‌ని ఫిల్మ్ న‌గ‌ర్ లో టాక్ వినిపిస్తోంది. మ‌రి... ఆవిరితో అయినా... ర‌విబాబు ఆశించిన విజ‌యం ద‌క్కుంద‌ని ఆశిద్దాం.

Next Story