చిత్తూరులో మరో బాలికపై అత్యాచారయత్నం

By రాణి  Published on  12 Dec 2019 5:52 AM GMT
చిత్తూరులో మరో బాలికపై అత్యాచారయత్నం

చిత్తూరు జిల్లాలో ఓ కామాంధుడు మతిస్థిమితం లేని బాలికపై అత్యాచారం చేసేందుకు యత్నించిన ఘటన వెలుగుచూసింది. ఎస్ఆర్ పురం మండలం, పుల్లూరు క్రాస్ రోడ్డు వద్ద ఈ ఘటన జరిగింది. మతిస్థిమితం సరిగా లేని బాలిక తన సోదరుడితో కలిసి టైలర్ షాప్ కు వెళ్లింది. బయట పని చూసుకుని వస్తానని చెప్పి ఆమె సోదరుడు బాలికను అక్కడ వదిలి వెళ్లాడు. కామంతో కళ్లు మూసుకుపోయిన ఆ టైలర్ షాపు వ్యక్తి బాలికకు మాయమాటలు చెప్పి మిద్దెపైకి తీసుకెళ్లి అత్యాచారం చేయబోయాడు. ఇంతలో బాలిక సోదరుడు అక్కడి రావడంతో విషయం బయటికొచ్చింది. సోదరిపై అఘాయిత్యం చేయబోయిన వ్యక్తిని అతను చితకబాది పోలీసులకు అప్పగించారు. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బాలికను వైద్య పరీక్షల నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు.

బుధవారం సాయంత్రం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మహిళల భద్రత కోసం కొత్త చట్టాన్ని తీసుకొచ్చారు. ఏపీ క్రిమినల్ లా (సవరణ) బిల్లుకు మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. దీనికి ఏపీ దిశ యాక్ట్ గా పేరు కూడా పెట్టారు. దీని ద్వారా ఇకపై మహిళలపై దాడులు జరిగితే కఠిన చర్యలుంటాయని స్వయంగా ముఖ్యమంత్రే వెల్లడించారు. అయినప్పటికీ మృగాళ్ల ఆలోచనల్లో మార్పు రావడం లేదు. ఇంకెలాంటి శిక్షలు వేస్తే వారి ఆలోచనలు మారుతాయో అర్థం కావడం లేదంటున్నారు ప్రజలు.

Next Story