రాజేంద్రనగర్‌లో మళ్లీ చిరుత సంచారం

By సుభాష్  Published on  9 Jun 2020 2:42 AM GMT
రాజేంద్రనగర్‌లో మళ్లీ చిరుత సంచారం

హైదరాబాద్‌ శివార్లలోని రాజేంద్రనగర్‌లో మరోసారి చిరుత కలకలం రేపుతోంది. వ్యవసాయ యూనివర్సిటీ పరిసరాల్లో చిరుత సంచరిస్తోంది. చిరుత నారం ఫామ్‌ హౌస్‌ వద్ద ఓ ఇంటి కాంపౌండ్‌లోకి వెళ్లింది. కాగా, తాజాగా చిరుత కదలికలు అక్కడి సీసీటీవీ పుటేజీలో కనిపించడంతో స్థానికులు తీవ్ర భయాందోళన చెందుతున్నారు. చిరుత కదలికలపై అధికారులకు సమాచారం అందించారు. ఇటీవల రోడ్డుపై ప్రత్యక్షమైన చిరుత కొన్ని గంటలపై ఉండి, అధికారులు పట్టుకునేందుకు ప్రయత్నించగా, తప్పించుకుని రాజేంద్రనగర్‌ శివారులోకి పరుగులు పెట్టింది. దీంతో అప్పటి నుంచి అధికారులు చిరుతను పట్టుకునేందుకు ప్రయత్నించినా.. అది సాధ్యం కాలేకపోయింది.

కాగా, మే 29న కూడా రాజేంద్రనగర్‌ జాతీయ వ్యవసాయ పరిశోధన విస్తరణ సంస్థ సమీపంలోని ట్యాంక్‌ ఏరియాలో ఓ సీసీటీవీ పుటేజీలో చిరుత సంచరించన ఆనవాళ్లు రికార్డు అయ్యాయి. కాగా, ఆ ప్రాంతంలోనే గ్రేహౌండ్స్‌ పోలీసుల శిక్షణ కేంద్రం ఉండటంతో పలు ప్రాంతాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. చిరుత అక్కడి నిర్మానుష్య ప్రాంతంలో సంచరించినట్లు సీసీ కెమెరాల ద్వారా అధికారులు గుర్తించారు.

అంతేకాకుండా పులి సంచరిస్తున్నట్లు రాజేంద్రనగర్‌ జయశంకర్‌ యూనివర్సిటీ సెక్యూరిటీ సిబ్బంది కూడా పోలీసులకు సమాచారం అందించారు. గత నెల 14న గగన్‌పహాడ్‌ సమీపంలో చిరుత సుమారు మూడు గంటల పాటు సంచరించింది. అటవీ అధికారులు, పోలీసులు తీవ్రంగా శ్రమించినా ఆచూకీ దొరకకుండా పోయింది.

అయితే ఓ స్థానికుడు హిమాయత్‌సాగర్‌లో నీరు తాగుతుండగా చూసినట్లు అధికారులకు తెలుపడంతో అక్కడ గాలింపు చర్యలు చేపట్టారు. చిరుత సంచరించినట్లు సీసీటీవీలో రికార్డ్‌ కావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. మళ్లీ చిరుత సంచరిస్తున్నట్లు తెలియడంతో చుట్టుపక్కల ఉన్న పలు కాలనీలు రాజేంద్రనగర్‌ గ్రామస్తులను జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచించారు.

Next Story