UNOకు పూనమ్ కౌర్ ..ఎందుకు వెళ్లింది?ఎవర్ని కలిసింది?

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  3 Oct 2019 12:20 PM GMT
UNOకు పూనమ్ కౌర్ ..ఎందుకు వెళ్లింది?ఎవర్ని కలిసింది?

న్యూయార్క్: జాతిపిత మహాత్మాగాంధీ ప్రబోధించిన శాంతి, అహింస మార్గంలో పూనంకౌర్ ప్రయాణిస్తున్నారు. జీవితంలో శాంతి, అహింస మార్గాన్ని ఆమె బలంగా విశ్వసిస్తారు. మహాత్ముని 150వ జయంతి సందర్భంగా అమెరికాలోని న్యూయార్క్ లోని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయాన్ని ఆమె సందర్శించారు. అక్కడి అధికారులను కలిసి గాంధీజీ శాంతి సందేశాన్ని ప్రపంచానికి చాటి చెప్పేలా ప్రత్యేక చిత్రపటాలను అందించారు. అధికారులతో కలిసి గాంధీజీ 150వ జయంతిని సెలబ్రేట్ చేశారు.

ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయంలో భారత ప్రతినిధి సయ్యద్ అక్బరుద్దీన్‌కి గాంధీజీ చిత్రపటాన్ని శాంతి సందేశంగా అందించారు పూనమ్‌ . అలాగే, కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా కార్యాలయంలో భారత రాయబారి సందీప్ చక్రవర్తిని కలిశారు. ఐక్యరాజ్యసమితిలో భారతదేశ వ్యవహారాలు చూసే డిప్యూటీ రిప్రజెంటేటివ్ నాగరాజ్ నాయుడుతో పూనంకౌర్ సమావేశమయ్యారు.

ఈ సందర్భంగా పూనం కౌర్ మాట్లాడుతూ... "మహాత్ముని 150వ జయంతి రోజున ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయంలో భారత ప్రతినిధులతో సమావేశం కావడం చాలా సంతోషంగా ఉందన్నారు. సంప్రదాయ కళలు వర్లీ, కలంకారి, మధుబని పద్ధతుల్లో రూపొందించిన గాంధీజీ చిత్రపటాన్ని సయ్యద్ అక్బరుద్దీన్ కి అందించాను. ఉన్నతాధికారుల ద్వారా గాంధీజీ గారి ఫస్ట్ పెయింటింగ్ ప్రధాని నరేంద్ర మోదీ గారికి అందజేశాను." అని చెప్పారు.

ఈ ప్రపంచంలో శాంతి నెలకొనాలంటే ఏం చేస్తే బావుంటుంది అని నేను ఎప్పుడూ ఆలోచిస్తూ ఉంటానన్నారు పూనమ్ కౌర్‌. నా ఆలోచనలను అక్బరుద్దీన్‌తో పంచుకున్నాను. ప్రశాంతంగా ప్రతి విషయాన్ని ఆయన విన్నారు. మహాత్మ గాంధీజీ అనుసరించిన శాంతి మార్గమే మనకు స్వాతంత్రాన్ని తీసుకొచ్చింది. జీవితంలో ఆయన నమ్మిన సూత్రాలు, పాటించిన విధానాలు.. ‌ ఆయనను మహాత్ముని చేశాయని నమ్ముతాను అన్నారు పూనమ్.

Next Story