యాద్రాద్రి జిల్లా పల్లెర్ల గ్రామంలో పోలీసుల అత్యుత్సాహం..!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  10 Oct 2019 11:09 AM GMT
యాద్రాద్రి జిల్లా పల్లెర్ల గ్రామంలో పోలీసుల అత్యుత్సాహం..!

యాదాద్రి భువనగిరి జిల్లా: పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. ఆత్మకూరు మండలం పల్లెర్ల గ్రామంలో దుర్గామాతా శోభాయాత్రలో పోలీసులు రెచ్చిపోయారు. కుంకుమ మీద పడిందన్న కోపంతో యువకుడిని పోలీసులు చితకబాదారు. వివరాల్లోకి వెళ్తే పల్లెర్ల గ్రామంలో దుర్గామాత శోభయాత్ర సందర్భంగా పోలీసులు బందోబస్తులో పాల్గొన్నారు. కాగా శోభయాత్రలో ఆత్మకూరు ఎస్సై పై కుంకుమ పడడంతో ఆగ్రహానికి గురయ్యారు. యువకుడిని కానిస్టేబుల్స్ తో ఆత్మకూరు ఎస్సై చితకబాదించారు. దీంతో పోలీసుల దెబ్బలకు యువకుడు సొమ్మసిల్లి కిందపడి పోయాడు. కళ్లముందే కొడుకుని కొడుతుండటంతో అడ్డుకోబోయిన తల్లిని బూతులు తిడుతూ పోలీసులు దురుసుగా ప్రవర్తించారు. ఓ రాజకీయ పార్టీకి కొమ్ముకాస్తు ఆత్మకూరు ఎస్సై భయబ్రాంతులకు గురిచేస్తున్నారని గ్రామస్తులు తెలిపారు. మాపైన దాడి చేస్తున్న వారిపై పోలీసు అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడంలేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. అమాయకులపై ప్రతాపం చూపిస్తూ ప్రజాప్రతినిధులకు ఊడిగం చేస్తున్న ఎస్సైపై తక్షణమే చర్యలు తీసుకోవాలన్నారు. లేదంటే ఆందోళనకు దిగుతామని బాధితులు పోలీసులను హెచ్చరించారు.

Next Story