లిట్టి-చోకా తిని.. ఛాయ్ తాగి.. రూ.120 బిల్లు కట్టి..
By Newsmeter.Network Published on 19 Feb 2020 2:23 PM GMTనిత్యం బిజీ షెడ్యూల్తో తీరిక లేకుండా ఉండే ప్రధాని నరేంద్రమోదీ ఢిల్లీ ఎగ్జిబిషన్లో సందడి చేశారు. రాజ్పథ్లోని ‘హునార్ హట్' మేళాను ఆకస్మికంగా సందర్శించి.. అందరిని ఆశ్చర్యపరిచారు. బీహార్,తూర్పు ఉత్తరప్రదేశ్ లో ఫేమస్ వంటకం "లిట్టి-చోకా" టేస్ట్ చేశారు. కేంద్ర మైనార్టీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో సంప్రదాయ హస్తకళల ప్రదర్శనను ఏర్పాటు చేశారు. ఈ ఎగ్జిబిషన్లో 50 నిమిషాలు పాటు ఉన్న మోదీ.. హస్త కళల స్టాల్స్ని సందర్శించి వ్యాపారులతో మాట్లాడారు.
అనంతరం లిట్టి చోకా తిని మట్టి కప్పులో చాయ్ తాగారు. లిట్టి చోకా తిన్నందుకు రూ.120 నగదును మోదీ చెల్లించారు. అనంతరం కేంద్రమంత్రి ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీతో కలిసి మట్టి గ్లాసుల్లో టీ తాగారు. ఇద్దరి ఛాయ్ డబ్బులు రూ.40 మోడీనే చెల్లించారు. 10 రోజులపాటు కొనసాగనున్న ఈ మేళాకు అన్ని రాష్ర్టాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన హస్తకళలు, చేతివృత్తుల ఉత్పత్తులను ప్రదర్శిస్తున్నారు. సుమారు 250కిపైగా స్టాల్స్ ఏర్పాటు చేశారు.