'జమాబందీ' వ్యవస్థను తిరిగి చేపడతాం : డిప్యూటీ సీఎం  

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  28 Sep 2019 7:44 AM GMT
జమాబందీ వ్యవస్థను తిరిగి చేపడతాం : డిప్యూటీ సీఎం  

అమరావతి: నవరత్నాలు, పేదలందరికీ ఇళ్లు, రెవెన్యూ రికార్డుల స్వచ్చీకరణ పథకాలు, కార్యక్రమాలపై కర్నూలు జిల్లా నంద్యాలలో వైఎస్ఆర్ సెంటినరీ హాల్ లో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ కార్య‌క్ర‌మంలో డిప్యూటీ సీఎం పిల్లి సుభాష్ చంద్ర‌బోస్ పాల్గొన్నారు.

రాష్ట్రంలో భూ రికార్డుల ప్రక్షాళన చేయడానికి ప్రభుత్వం కసరత్తు చేస్తోందని ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ అన్నారు. తద్వారా భూ సమస్యల పరిష్కారం సులభమవుతుందన్నారు. 1983 లో అప్పటి ప్రభుత్వం చేపట్టిన చర్యల వల్ల భా రికార్డుల వ్యవస్థ అస్తవ్యస్తమైందన్నారు. 1983కు ముందున్న పద్ధతిని తీసుకురావడానికి సీఎం జగన్ కసరత్తు చేస్తున్నారని డిప్యూటీ సీఎం తెలిపారు.

1983లో ఎన్టీ రామారావు తీసుకొచ్చిన కొత్త రెవెన్యూ సిస్టమ్స్ వల్ల భూ రికార్డుల వ్యవస్థ దెబ్బతిన్నదన్నారు. తరువాత ప్రత్యామ్నాయ చర్యలు కూడా చేపట్టలేదని తెలిపారు. దీంతో భూ యజమానులకు, రెవెన్యూ అధికారులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు.

రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఆక్టోబరు 2 నుంచి భూములు రీ సర్వే చేయడానికి 11 వేల మంది సర్వేయర్లను నియమించినట్లు సుభాష్ తెలిపారు. ఈ ఉగాది నాడు రాష్ట్రంలో నిరుపేదలకు 25 లక్షల ఇళ్ల పట్టాల పంపిణీ సీఎం జగన్ చేస్తారని చెప్పారు. ముఖ్యమంత్రి ఆశయానికి అనుగుణంగా గ్రామ స్థాయి విఆర్వో నుంచి మండల తాహసీల్దార్లు, సర్వేయర్లు, ఆర్డీవోలు, జిల్లా స్థాయి కలెక్టర్, జేసీ వరకు సర్వే, రెవెన్యూ అధికారులందరూ కృషి చేసి ఒక్క ఎకరా కూడా తేడా రాకుండా భూ రికార్డుల స్వచ్చీకరణకు, నిరుపేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ చర్యలు చేపట్టాలని డిప్యూటీ సీఎం పిల్లి సుభాష్ చంద్రబోస్ ఆదేశించారు

రాబోయే ఐదేళ్లలో రాష్ట్రంలో నిరుపేదలకు 25 లక్షల ఇళ్లు నిర్మించి ఇవ్వాలనేది రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యంగా ఉందని మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, శ్రీరంగనాథ రాజు తెలిపారు. అక్టోబరు 2 నుంచి రాష్ట్రంలో గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ అందుబాటులోకి వస్తుందని.. ఒకేసారి లక్షల మందికి ఉద్యోగాలు ఇవ్వడం దేశ చరిత్రలో ఎక్కడా జరగలేదని మంత్రులు పేర్కొన్నారు.

ఈ కార్య‌క్ర‌మంలో హౌసింగ్ మంత్రి శ్రీరంగనాథరాజు, ఫైనాన్స్ మంత్రి శ్రీ బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఎంపీ పోచా బ్రహ్మానంద రెడ్డి, శాసనమండలి విప్ గంగుల ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యేలు శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి, కాటసాని రామిరెడ్డి, గంగుల బిజేంద్రనాథ రెడ్డి, సీనియర్ ఐఏఎస్ అధికారి, హౌసింగ్ ప్రిన్సిపల్ సెక్రటరీ అజయ్ జైన్ తదితరులు పాల్గొన్నారు.

Next Story