ఏపీలోకి రావాలంటే అనుమతులు తప్పని సరి : డీజీపీ గౌతమ్ సవాంగ్
By తోట వంశీ కుమార్ Published on 1 Jun 2020 11:01 AM ISTలాక్డౌన్ 5.0లో భాగంగా కేంద్ర ప్రభుత్వం అంతరాష్ట్ర రాకపోకలకు అనుమతులు ఇచ్చింది. అయితే.. దీనిపై రాష్ట్రాలదే తుది నిర్ణయంగా కేంద్రం చెప్పింది. తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే అంతరాష్ట్ర ప్రయాణాలపై నిషేదం ఎత్తివేయగా.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం నిషేదం కొనసాగుతోంది.కరోనా వైరస్ కేసులు పెరుగుతుండడంతోనే ఈ నిర్ణయం తీసుకుంది.
అంతరాష్ట్ర రాక పోకలపై షరతులు కొనసాగుతాయని ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ స్పష్టం చేశారు. అంతర్ రాష్ట్ర కదలిక లపై ఏపీ ప్రభుత్వం తదుపరి నిర్ణయం తీసుకొనేంత వరకు షరతులు కొనసాగనున్నాయని చెప్పారు. ఇతర రాష్ట్రాల నుంచి ఏపీ కి రావాలనుకునే ప్రయాణీకులు స్పందన పోర్టల్ ద్వారా ఈ పాస్ తీసుకోవాలన్నారు. కరోన ప్రభావం తక్కువ గా ఉన్న రాష్ట్రాల నుంచి వచ్చే వారు హోం క్వారెంటైన్ లో ఉండాల్సిందేనని, కరోన ప్రభావం ఎక్కువ గా ఉన్న రాష్ట్రాల నుంచి వొచ్చే వారు 7 రోజులు ఇన్ట్సిట్యూషనల్ క్వారెంటైన్ లో ఉండాలని స్పష్టం చేశారు. కోరోనా పరీక్షలు చేయించుకోవాలని, పాజిటివ్ వస్తే ఆస్పత్రికి, నెగిటివ్ వస్తే ఏడు రోజులు హోం క్వారంటైన్కు వెళ్లాల్సి ఉంటుందని తెలిపారు. ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు వచ్చేవరకు అంతర్రాష్ట్ర సరిహద్దుల వద్ద ఆంక్షలు కొనసాగుతాయని పేర్కొన్నారు.