రైల్వే స్టేషన్లో అలా చేస్తే.. ఫ్రీ టికెట్..
By Newsmeter.Network Published on 21 Feb 2020 11:20 AM GMTడిల్లీలో ఆనంద్ విహార్ రైల్వే స్టేషన్లో ఏర్పాటు చేసిన ఓ మిషన్ ప్రయాణీకులను తెగ ఆకట్టుకొంటోంది. ఆ మిషన్ ఉచితంగా ప్లాట్ఫాం టిక్కెట్ను అందిస్తోంది. కాకపోతే.. ఉచితంగా టికెట్ పొందడం కోసం కాస్త ఒళ్లు వంచాల్సిందే. వ్యాయామాన్ని ప్రోత్సహించి ఆరోగ్యంపై ప్రజలకు అవగాహాన కల్పించేందుకు రైల్వేశాఖ వినూత్న ప్రయోగం చేపట్టింది.
ఆ మిషన్ ముందు నిలుచుని కొద్దిసేపు సిట్ అప్స్ చేస్తే చాలు.. మెషీన్ ఉచిత ప్లాట్ఫాం టికెట్ ఇచ్చేస్తుంది. కేంద్ర రైల్వే మంత్రి పీయూష్ గోయల్ ఇందుకు సంబంధించిన వీడియోను తన ట్విట్టర్ అకౌంట్లో పోస్టు చేశారు. 'ఫిట్నెస్తో పాటు పొదుపు కూడా.. ఫిట్నెస్ను పోత్సహించేందుకు ఢిల్లీలోని ఆనంద్ విహార్ రైల్వే స్టేషన్లో విన్నూత ప్రయోగం' అని పేర్కొన్నారు. కాగా.. ఈ వీడియోలో ఓ వ్యక్తి మెషీన్ ఎదురుగా నిలుచుని కాసేపు సిట్ అప్స్ చేయడంతో.. అతనికి ఉచిత ప్లాట్ఫాం టికెట్ లభించింది. ఇప్పటికే కొన్ని దేశాల్లో ఈ విధానం అందుబాటులో ఉంది. భారత్లో తొలిసారి ప్రవేశపెట్టారు.